AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Panchami: గరుడ పంచమి.. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడి మహిమ, పూజా ప్రాధాన్యత తెలుసా?

Garuda Panchami 2026 Telugu: శ్రావణ శుక్ల పక్ష పంచమి రోజున జరుపుకునే గరుడ పంచమి సందర్భంగా శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడి జన్మ, మహిమ, వైదిక ప్రాధాన్యత, పూజా విశేషాలను వివరంగా తెలుసుకుందాం. ఈరోజున ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

Garuda Panchami: గరుడ పంచమి.. శ్రీమహావిష్ణువు వాహనమైన గరుడుడి మహిమ, పూజా ప్రాధాన్యత తెలుసా?
Garuda Panchami 2026 Telugu
Rajashekher G
|

Updated on: Aug 17, 2026 | 9:44 AM

Share

Garuda Panchami Telugu: హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో గరుడ పంచమికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిని గరుడ పంచమిగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువు పరమభక్తుడైన గరుడుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గరుడుడు కేవలం విష్ణుమూర్తి వాహనం మాత్రమే కాకుండా, ఆయనకు అత్యంత ప్రియమైన భక్తుడిగా, నిత్య సేవకుడిగా వైదిక సాహిత్యంలో వర్ణించబడ్డాడు.

గరుడుడు ఎవరు?

పురాణాల ప్రకారం గరుడుడు కశ్యప మహర్షి, వినతా దేవి కుమారుడు. ఆయనను అపారమైన శక్తి, వేగం, భక్తికి ప్రతీకగా భావిస్తారు. శ్రీమహావిష్ణువును తన వీపుపై మోస్తూ నిత్యం ఆయన సేవలో ఉండే గరుడుడు, విష్ణువు వాహనాలలో అత్యున్నతుడిగా పరిగణించబడతాడు. గరుడుడికి పక్షిరాజు, వైనతేయుడు, సుపర్ణుడు, గరుత్మంతుడు, వినతాసుతుడు, విష్ణువాహనుడు, నాగాంతకుడు, కశ్యపేయుడు వంటి అనేక పేర్లు ఉన్నాయి.

గరుడుడి గురించి భగవద్గీతలో ఏముంది?

శ్రీకృష్ణుడు భగవద్గీతలో “వైనతేయశ్చ పక్షిణామ్” అని పేర్కొంటాడు. అంటే, “పక్షులలో నేను గరుడుడిని” అని అర్థం. దీనివల్ల గరుడుడి విశిష్టత, దైవత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. శ్రీమహావిష్ణువు సేవలో నిరంతరం నిమగ్నమై ఉండే గరుడుడు పరమభక్తికి ప్రతిరూపంగా భావించబడతాడు. అందుకే గరుడుడిని ఆరాధించడం ద్వారా భక్తి, ధైర్యం, దైవానుగ్రహం కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ఇవి కూడా చదవండి

గరుడుడికి, వేదాలకు ఉన్న సంబంధం

వైదిక సాహిత్యంలో గరుడుడి రెండు రెక్కలను సామవేదంలోని బృహత్, రథాంతర అనే రెండు విభాగాలకు ప్రతీకలుగా పేర్కొంటారు. గరుడుడు తన రెక్కలను ఆడించినప్పుడు సామవేద మంత్రాల నాదం వినిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. గరుడుడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు నిత్య సేవ చేస్తాడని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. అందుకే విష్ణు ఆలయాల్లో స్వామివారి సన్నిధికి ఎదురుగా గరుడాళ్వార్ లేదా గరుడ దేవుడి విగ్రహం చేతులు జోడించిన భంగిమలో కనిపిస్తుంది.

గరుడ పంచమి రోజున ఏం చేస్తారు?

గరుడ పంచమి రోజున భక్తులు గరుడ దేవుడిని, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆలయాల్లో గరుడుడికి ప్రత్యేక అభిషేకం, అలంకరణ, హారతి వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ రోజున విష్ణు సహస్రనామం, విష్ణు స్తోత్రాలు, గరుడ స్తోత్రాలను పారాయణం చేస్తూ స్వామివారిని స్మరించడం శుభప్రదంగా భావిస్తారు. భక్తులు తమ శక్తి మేరకు దానధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక పుణ్యాన్ని పొందాలని కోరుకుంటారు.

గరుడ స్తోత్రంలో ఉన్న ప్రార్థన

  • గరుడో భగవాన్ స్తోత్ర-స్తోభశ్చందోమయః ప్రభుః
  • రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విశ్వక్సేనః స్వనామభిః

ఈ ప్రార్థనలో గరుడుడిని స్తుతిస్తూ, అన్ని రకాల కష్టాలు, ప్రమాదాల నుంచి రక్షణ కల్పించాలని ప్రార్థిస్తారు. అలాగే శ్రీమహావిష్ణువు నామస్మరణ ద్వారా కూడా భక్తులకు రక్షణ లభించాలని కోరుకుంటారు.

గరుడ పంచమి ఆధ్యాత్మిక సందేశం

గరుడ పంచమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. భగవంతుడిపై అచంచలమైన భక్తి, నిస్వార్థ సేవ, ధైర్యం, దైవంపై సంపూర్ణ విశ్వాసానికి ప్రతీక. శ్రీమహావిష్ణువుకు గరుడుడు చూపిన నిత్య భక్తి ప్రతి భక్తుడికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భగవంతుడిపై విశ్వాసం ఉంచి, ధర్మబద్ధంగా జీవిస్తూ, నిస్వార్థంగా సేవ చేయాలనే భావనను ఈ పర్వదినం గుర్తుచేస్తుంది.

గరుడ పంచమి రోజున గరుడ దేవుడిని, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో స్మరించి, స్తోత్రాలు పఠించి, ఆధ్యాత్మిక చింతనలో గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత, భక్తి భావన కలుగుతాయని భక్తుల విశ్వాసం.

తిరుమలలో గరుడ సేవలు ప్రత్యేకం

తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెలలో శ్రీ మలయప్ప స్వామివారి గరుడ సేవను రెండుసార్లు వీక్షించే అవకాశం లభించనుంది. ఆగస్టు 17, 28 తేదీల్లో గరుడ సేవలు నిర్వహించనున్నారు. మొదటి గరుడ సేవను గరుడ పంచమి సందర్భంగా ఆగస్టు 17, సోమవారం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నాలుగు మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. రెండో గరుడ సేవను శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న నిర్వహించనున్నారు. ఆ రోజు కూడా శ్రీ మలయప్ప స్వామివారిని గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఊరేగిస్తారు.

(Disclaimer: ఈ కథనం పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న విషయాలను భక్తి, విశ్వాస పరమైన అంశాలుగా మాత్రమే పరిగణించాలి.)

Follow Us