రామయ్యపట్నం తీరంలో మత్స్యకారులు గల్లంతు.. ఐదు రోజులుగా దొరకని ఆచూకీ.. ఆందోళనలో కుటుంబసభ్యులు
కొత్త బోటు కొనేందుకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బంగాళఖాతంలో గల్లంతయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని మడఅడవిల తీరంలో చోటుచేసుకుంది.
కొత్త బోటు కొనేందుకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు బంగాళఖాతంలో గల్లంతయ్యారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని మడఅడవిల తీరంలో చోటుచేసుకుంది. ఐదు రోజుల కిందట తొండంగి మండలం యల్లయ్యపేటకు చెందిన చిరిపిన ఈశ్వర్ రావు, చొక్కా రమేష్, మడదా శ్రీనివాసరావు, సూరాడ వేంకటేశ్వర్లు ఒడిశా తీరంలోని పారాదీప్ లో కొత్త బోటు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. బోటు కొనుగోలు చేసిన నలుగురు మత్స్యకారులు తిరిగి ప్రయాణం అయ్యారు. అయితే, రామయ్యపట్నం గంజాం సమీపంలోని అడ్డకొండ మధ్యలో వారు ప్రయాణిస్తున్న బోటుకు సాంకేతిక లోపం తలెత్తడంతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇంజిన్ ఆగిపోయింది కోస్ట్ గార్డ్ కి సమాచారం ఇవ్వండి అంటూ చివరిసారిగా కుటుంబసభ్యులకు వాయిస్ మెసేజ్ చేశారు.
కాగా, ఈనెల 7వ తేది తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోటు ఆచూకీ కోసం అధికారులు పట్టించుకోవడం లేదంటూ కుటుంబసభ్యులు వాపోయారు. గల్లంతైన మత్యకారుల ఆచూకీ వెంటనే కనుక్కోనేందుకు చొరవ చూపాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.