AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబ్బాకలో ఢీ అంటే ఢీ.. ఫలితంపై హైటెన్షన్..!

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితానికి ఇక కొద్ది గంటలే మిగిలింది. టెన్షన్‌ పెరుగుతోంది. అభ్యర్థుల్లోనే కాదు... పార్టీల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

దుబ్బాకలో ఢీ అంటే ఢీ.. ఫలితంపై హైటెన్షన్..!
Balaraju Goud
|

Updated on: Nov 09, 2020 | 7:45 PM

Share

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితానికి ఇక కొద్ది గంటలే మిగిలింది. టెన్షన్‌ పెరుగుతోంది. అభ్యర్థుల్లోనే కాదు… పార్టీల్లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. దుబ్బాక దంగల్‌లో గెలిచేదెవరు? ఇప్పుడు అందరిలో ఒకటే చర్చ. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాలమరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించాయి.

దుబ్బాకలో జరిగింది ఉప ఎన్నికే కానీ… ప్రచారం మాత్రం సాధారణ ఎన్నికల స్థాయిలో నడిచింది. సవాళ్లు హైరేంజ్‌లో కొనసాగాయి. పోలీసుల దాడులు, పట్టుబడిన నోట్ల కట్టలు… పోలింగ్‌కు ముందు వారం రోజులు ఎన్నికల రాజకీయం అంతా దాని చుట్టూనే తిరిగింది. మరి ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు టెన్షన్‌ను పెంచేస్తోంది. సాధారణంగా ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటుంది. దుబ్బాకలో గత పోలింగ్‌ రేంజ్‌లోనే ఇప్పుడు ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓటర్లు లక్షా 98 వేల 756 మంది ఉంటే… లక్షా 64 వేల 192 మంది ఓటేశారు. 82.61 శాతం పోలింగ్‌ జరిగింది. 2018 డిసెంబర్‌లో 86 శాతం నమోదైంది. ఇక్కడ మహిళలే డిసైడింగ్‌ ఫ్యాక్టర్‌. ఈసారి సైలెంట్‌ ఓటింగ్‌ ఎక్కువగా జరిగింది.

ప్రచారంలో డబ్బులాట జరిగిన నేపథ్యంలో… కౌంటింగ్‌ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా భద్రతను పెంచారు పోలీసులు. సిద్ధిపేట శివారులోని ఇందూరు ఇంజనీరింగ్‌ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ జరుగుతుంది. మొదట బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. 1,453 బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. ఎనిమిదిన్నర తర్వాత ఈవీఎంలను తెరుస్తారు. 14 టేబుళ్లపై 23 రౌండ్లలో కౌంటింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌లో 350 సిబ్బంది పాల్గొంటున్నారు. కాగా, 500 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసు కమిషనర్ జోయల్‌ తెలిపారు.

మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మెజార్టీ ఎంత వస్తుందనేదే గులాబీ కేడర్‌లో ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ సైతం గెలిచేది తామేనని, ఎవరూ ఊహించని ఫలితం తమకు వస్తుందని చెబుతోంది. కాంగ్రెస్‌ కూడా ఇదే స్పష్టం చేస్తోంది. మరి ఓటరు తీర్పు ఏంటనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.