AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూపం మారిన కరోనా… డెన్మార్క్‌లో మింక్‌ల ద్వారా మనుషులకు వ్యాప్తి..!

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా వైద్య నిపుణులు చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

రూపం మారిన కరోనా... డెన్మార్క్‌లో మింక్‌ల ద్వారా మనుషులకు వ్యాప్తి..!
Balaraju Goud
|

Updated on: Nov 06, 2020 | 9:55 PM

Share

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా వైద్య నిపుణులు చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మార్పులతో వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్స్ పనిచేయవన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్‌ అనే జీవి నుంచి ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించినట్లు ఆ దేశ పరిశోధకులు తెలిపారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో డెన్మార్క్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. వందల కొద్ద ఫారమ్‌ల్లో మింక్‌లను పెంచుతున్న ఉత్తర జూట్‌ల్యాండ్‌ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో జనం ఎవరూ బహిరంగ ప్రదేశాల్లోకి రావద్దని ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం.

ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్‌ ఉత్తర డెన్మార్క్‌లో అదనపు కొవిడ్‌ ఆంక్షలు ఏడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇవి దాదాపు 2,80,000 లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ టీకాలుకు ఈ రకం వైరస్‌ ముప్పుగా మారవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ నివశించేవారు ప్రయాణాలు మానుకోవాలని ప్రధాని సూచించారు. దీనిని ఉల్లంఘిస్తే వ్యాధి వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర జూట్‌ల్యాండ్‌ వాసులు వ్యాధి వ్యాపించకుండా శతవిధాల కృషిచేయాలి. ప్రపంచం మనల్ని గమనిస్తోందని ప్రధాని ఫెడ్రెక్సన్‌ పిలుపునిచ్చారు.

ఇప్పటి వరకు స్థానిక పత్రికల కథనం ప్రకారం 207 మింక్‌ పెంపుడు కేంద్రాల్లో కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించారు. వీటిని మొదట్లో గుర్తించడంలో అధికారులు విఫలం అయ్యారు. ఈ ప్రాంతంలో దాదాపు 1,100 పెంపుడు కేంద్రాల్లో దాదాపు 1.7 కోట్ల మింక్‌లు వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తాజాగా ఐదు మింక్‌ పెంపుడు కేంద్రాల్లో 12 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. అదే జూన్‌ నుంచి చూస్తే 214 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ది స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే ఆలస్యమైందని వైద్య నిపుణులు అంటున్నారు. దాదాపు ఐదున్నర నెలలుగా ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేశారని హజ్రింగ్‌ మేయర్‌ డాక్టర్‌ ఆర్నె బోయెల్ట్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us