Pakistan Floods:పాకిస్తాన్ లో వరదల విలయ తాండవం సృష్టిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కురిసిన వర్షాలకు పాక్ అతాలాకుతలం అవుతోంది. వరదల కారణంగా గత 24 గంటల్లో దాదాపు 120 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు వెయ్యి మంది చనిపోయారు. పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం వరదల బీభత్సానికి 1033 మంది చనిపోయారు. 1500 మంది వరకు గాయపడ్డారు. గత 30 సంవత్సరాల్లో పాకిస్తాన్ లో సగటు వర్షపాతం 132.3 మిల్లీ మీటర్లు కాగా.. ఈఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 385.4 మిల్లీమటర్ల వర్షపాతం నమోదైంది. గత 30 ఏళ్లతో పోలిస్తే ఇది 192 శాతం ఎక్కువ. ఈ వర్షాలతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు 3కోట్ల 30 లక్షల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపించాయి.
వరద బాధితులకు సాయం చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఇప్పటిరవకు వరదల కారణంగా పాకిస్తాన్ లో 149 వంతెనలు కొట్టుకుపోగా, 6లక్షల 82వేల 139 ఇళ్లు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. 110 జిల్లాల్లోని 57 లక్షలమందికి ఆహారం అందడం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే, ప్రతికూల వాతావరణం కారణంగా బలూచిస్థాన్ ప్రావిన్స్కు విమాన రాకపోకలను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ నిలిపివేసింది. కాగా కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ను ఆదుకునేందుకు ఖతార్, ఇరాన్ సహా కొన్ని దేశాలు ముందుకొచ్చాయి. అత్యవసర సహాయాన్ని అందిస్తామని ప్రకటించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..