Andhra Pradesh: బైక్ పై కుమారుడి మృతదేహం తరలింపు.. నెల్లూరు జిల్లాలో రుయా తరహా ఘటన
కన్న కొడుకు బతికే ఉన్నాడన్న చిన్న ఆశ.. ఆ తండ్రిని ఆస్పత్రి వరకు పరుగులు పెట్టించింది. అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పిన సమాధానంతో ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు...

కన్న కొడుకు బతికే ఉన్నాడన్న చిన్న ఆశ.. ఆ తండ్రిని ఆస్పత్రి వరకు పరుగులు పెట్టించింది. అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పిన సమాధానంతో ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కోరాడు. 108 వాహనం ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవంటూ సిబ్బంది చెప్పడంతో గత్యంతరం లేని స్థితిలో బైక్ పై తీసుకెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు(Nellore) జిల్లా సంగంలో జరిగింది. తిరుపతి(Tiruapati) రుయా ఆస్పత్రి తరహా జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టించింది. జిల్లాలోని సంగం ప్రాంతానికి చెందిన శ్రీరామ్, ఈశ్వర్ అనే ఇద్దరు బాలలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి.. కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో జారిపడ్డారు. ఈ ఘటనలో చిన్నారులిద్దరూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు.. కాల్వలో దిగి పిల్లల కోసం గాలించారు. ఈశ్వర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్ను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు శ్రీరామ్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు 108 వాహనం ఏర్పాటు చేయాలని శ్రీరామ్ బంధువులు ఆస్పత్రి సిబ్బందిని కోరారు. ఇందుకు వారు నిరాకరించారు. రూల్స్ ఒప్పుకోవంకటూ కర్కశంగా వ్యవహరించారు. మహాప్రస్థానం వాహనం కూడా అందుబాటులో లేదు. ఆటోలు, ఇతర వాహనాలను అడిగినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో బైక్ పైనే శ్రీరామ్ మృతదేహాన్ని ఇంటికి తరలించారు.
తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెస్స్ కు డబ్బులు ఇవ్వలేని ఓ తండ్రి.. కన్నకొడుకు డెడ్ బాడీని భుజంపై వేసుకుని బైక్ పై వెళ్లాడు. సుమారు 12 కి.మీ. ప్రయాణించి అక్కడ తాము మాట్లాడుకున్న అంబులెన్స్లో ఎక్కించి మృతదేహాన్ని తన సొంత ఊరికి తీసుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎస్ ఆర్ఎంవో సరస్వతీదేవిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి


