నాలుగేళ్లుగా టాయిలెట్‌లోనే నివ‌శిస్తోన్న కుటుంబం..ఎంత దౌర్భాగ్యం

|

Jul 26, 2020 | 8:03 PM

ఇంకా ఎన్నాళ్లు చెప్పుకుందాం..మ‌న ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని..ద‌శాబ్దాలు గ‌డుసున్నా..మ‌నం అభివృద్ధి వైపు పయ‌నించ‌లేక‌పోతున్నాం.

నాలుగేళ్లుగా టాయిలెట్‌లోనే నివ‌శిస్తోన్న కుటుంబం..ఎంత దౌర్భాగ్యం
Follow us on

ఇంకా ఎన్నాళ్లు చెప్పుకుందాం..మ‌న ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని..ద‌శాబ్దాలు గ‌డుసున్నా..మ‌నం అభివృద్ధి వైపు పయ‌నించ‌లేక‌పోతున్నాం. ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌లు తీవ్ర దారిద్య్రాన్ని ఎదురుకుంటున్నారు. క‌ట్టు బ‌ట్టలేనివారు, నిలువ నీడ లేనివారు, క‌డుపు నిండా తిండి లేనివారు కోకొల్ల‌లుగా ద‌ర్శ‌నమిస్తున్నారు. ప్రభుత్వ ప‌థ‌కాల‌న్నీ ఏం అవుతున్నాయి. ఇది అధికారుల నిర్ల‌క్ష్య‌మా..ప్ర‌భుత్వాల‌కు చిత్తశుద్ది లేక‌పోవ‌డమా ఈ ఘ‌ట‌న‌ను బ‌ట్టి మీరే చెప్పాలి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ పేద కుటుంబం గత నాలుగేళ్లుగా బాత్ రూంలోనే జీవ‌నం సాగిస్తున్నారు. టీకాంఘర్‌ జిల్లా మోహన్‌ఘర్ ఏరియాలోని కేశవ్‌ఘర్‌ గ్రామ పంచాయతీలో నివ‌శించే మగన్‌లాల్ అహిర్‌వార్ అనే వ్యక్తి తన భార్య నలుగురు పిల్లలతో కలిసి గత నాలుగు సంవత్సరాలుగా టాయిలెట్‌లో ఉంటూ బ్రత‌కు బండి నెట్టుకొస్తున్నాడు. ఈ విషయమై ప్ర‌శ్నించ‌గా అహిర్వార్ భార్య పూలాదేవి మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వ‌మ‌ని అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ టాయిలెట్‌లోనే ఉండి మా కూతురు పెళ్లి కూడా చేయాల్సి వ‌చ్చింద‌ని’ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఇదిలా ఉండ‌గా ఈ విషయంపై అధికారులు వెర్ష‌న్ వేరేలా ఉంది. ఉజ్వల పథకం కింద వారికి విద్యుత్ కనెక్షన్‌, గ్యాస్ క‌నెక్షన్ అందించామ‌ని స్థానిక తహసీల్దార్‌ అభిజీత్ సింగ్ వెల్ల‌డించారు. తాను వారి గురించి వాక‌బు చేశాన‌ని.. అహిర్‌వార్‌కు గ్రామంలో పూర్వీకుల ఇల్లు ఉందని చెప్పారు. కానీ అతను టాయిలెట్‌లో ఉంటున్న‌ట్లు తనకు చెప్పలేదని వెల్ల‌డించారు. అతడు ఇంతకుముందు మరుగుదొడ్డిలో నివసించి ఉండవచ్చు కానీ ప్రస్తుతం అతను ఉండ‌టం లేద‌ని తహసీల్దార్ పేర్కొన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి : కుమార్తెల‌తో కాడి మోయిస్తూ రైతు వ్య‌వ‌సాయం..చ‌లించిపోయిన సోనూసూద్..