న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేనిఫెస్టోకి ‘సంకల్ప్ పత్ర్’ అనే పేరు పెట్టారు. ఇది ఇలా ఉంటే బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పెద్ద తప్పు ఉందని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
అదేంటంటే మేనిఫెస్టోలోని పేజీ 32లోని పాయింట్ 11లో ఈ తప్పు జరిగినట్లు తెలుస్తోంది. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టాలు తీసుకొస్తామని చెప్పాల్సి ఉండగా.. నేరాలు పాల్పడిన వారికీ వీలుగా చట్టాలు తీసుకొస్తామని చెప్పడంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మండిపడుతున్నాయి.
బీజేపీ తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ తప్పును గమనించిన కాంగ్రెస్ పార్టీ… వాళ్ళ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘ ఈ ఒక్క పాయింట్ ద్వారా తమ అసలు రంగును బీజేపీ పార్టీ బయటపెట్టిందని’ కాంగ్రెస్ ట్వీట్ చేస్తూ బీజేపీ జుమ్లా మేనిఫెస్టో అని హ్యాష్ట్యాగ్ను వాడింది.
ఏది ఏమైనా అధికారక బీజేపీ పార్టీని రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలకు ఈ తప్పు ద్వారా మంచి అవకాశం దక్కిందని చెప్పాలి. అయితే ఇప్పటివరకు దీనిపై నరేంద్ర మోదీ గానీ, బీజేపీ సీనియర్ నేతలు గానీ స్పందించకపోవడం గమనార్హం.
At least one point in BJP’s manifesto reflects their true intentions. #BJPJumlaManifesto pic.twitter.com/b5CqRrOz0E
— Congress (@INCIndia) April 8, 2019