కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో జగన్ పర్యటన
కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఈ మహమ్మారి ప్రభావం తగ్గగానే గ్రామాల పర్యటన ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం తీరును
కరోనా సంక్షోభ సమయంలో కూడా ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఈ మహమ్మారి ప్రభావం తగ్గగానే గ్రామాల పర్యటన ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం తీరును స్వయంగా తెలుసుకుంటానని స్పష్టం చేశారు. అప్పటికల్లా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం అందేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని సీఎం ప్రకటించారు.
కరోనా కట్టడికోసం ఏపీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్, సీజనల్ వ్యాధులు, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇసుక సరఫరా, వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, పాఠశాలల్లో నాడు–నేడు పనులపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. రాష్ట్రంలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం మొత్తం రూ.22,355 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇందుకోసం 66,842 ఎకరాల భూముల్లో ఇళ్ల స్థలాలు లే అవుట్ వేశామని జగన్ తెలిపారు. లబ్ధిదారులు ఎవరైనా మిగిలిన వారు ఉంటే, వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వారికి అర్హత ఉంటే, గతంలో చెప్పిన విధంగా 90 రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తాం. ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టంచేశారు. నమోదు చేసుకున్న 72 గంటల్లో ఇసుక డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం జగన్ వివరించారు.