Proddatur: బాబోయ్.. చూస్తేనే కడుపులో దేవుతుంది.. పాపం వాళ్ల పరిస్థితి ఊహిస్తేనే..
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ టిఫిన్ సెంటర్లో పూరి కుర్మాలో బల్లి కనిపించడం కలకలం రేపింది. పార్సిల్ తీసుకెళ్లిన కస్టమర్ ఇంటికి వెళ్లి తినే సమయంలో ఈ విషయం గుర్తించి హోటల్ యజమానిని ప్రశ్నించగా, ఆయన నిర్లక్ష్యంగా స్పందించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి హోటల్ను మూసివేశారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఓ టిఫిన్ సెంటర్లో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ఇంట్లో వంట చేసే సమయంలో తెలియకుండా బొద్దింక, బల్లి వంటి జీవులు ఆహారంలో పడితే ఆ వంటకాన్ని పూర్తిగా పారేస్తాం. అలాంటిది ఓ హోటల్లో పూరి కుర్మాలో బల్లి పడినప్పటికీ దానిని గుర్తించకుండా కస్టమర్కు పార్సిల్గా ఇవ్వడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.
ప్రొద్దుటూరులోని గణేష్ టిఫిన్ సెంటర్ నుంచి ముస్తఫా అనే వ్యక్తి పూరి పార్సిల్ తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లి పూరితో పాటు కుర్మా వడ్డించుకుంటుండగా అందులో పెద్ద బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే ఆ పార్సిల్ను తీసుకుని టిఫిన్ సెంటర్కు వెళ్లి యజమానిని నిలదీశాడు. అయితే హోటల్ యజమాని బాధ్యతాయుతంగా స్పందించకుండా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించాడు. “బల్లిని తీసేసి తినొచ్చు. అది కుర్మాలో ఉడకలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఉడికితేనే ప్రమాదం” అని యజమాని చెప్పినట్లు ముస్తఫా వెల్లడించాడు. ఈ సమాధానంతో మనస్తాపానికి గురైన ఆయన ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి హోటల్ను మూసివేశారు. ఘటనపై విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో ప్రజారోగ్య భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత ప్రమాణాలను నిర్ధారించాల్సిన ఆహార భద్రత శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అలాంటి పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారానికోసారి లేదా కనీసం నెలకోసారి తనిఖీలు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
