సరిహద్దులో చైనా ఆగడాలు…ఆక్రమణకు అడ్డొచ్చిన భారత జవాన్లపై దాడి.. తూర్పు లఢాక్లో ఉద్రిక్త పరిస్థితులు..
సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. లఢాక్ నుంచి అరుణాచల్ వరకు ఏదో ఒక చోట ఇండియాను రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉంది. తూర్పు లద్దాక్ ప్రాంతంలో ఆక్రమణకు ప్రయత్నించి అడ్డొచ్చిన భారత జవాన్లపై..
China India Border : సరిహద్దులో చైనా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. లఢాక్ నుంచి అరుణాచల్ వరకు ఏదో ఒక చోట ఇండియాను రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతూనే ఉంది. తూర్పు లద్దాక్ ప్రాంతంలో ఆక్రమణకు ప్రయత్నించి అడ్డొచ్చిన భారత జవాన్లపై దాడి చేసిన చైనా.. ఆ తర్వాత వివాదాస్పద డోక్లాం ప్రాంతంలో భూటాన్ భూభాగంలో ఓ గ్రామాన్నే నిర్మించింది.
తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తన భూభాగంలోనే మూడు గ్రామాలను నిర్మించింది. ఇండియా, చైనా, భూటాన్ దేశాల జంక్షన్లో అరుణాచల్ ప్రదేశ్కు పశ్చిమాన ఉన్న బమ్ లా పాస్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామాల నిర్మాణం చేపట్టింది.
చైనా భారత్తో షేర్ చేసుకుంటున్న ఎల్ఏసీ దగ్గర 20 క్యాంపులను నిర్మించింది. ఈ క్యాంపులకు దగ్గర్లో కొన్ని గ్రామాలు కూడా ఉన్నట్లు భారత్ గుర్తించింది. ఈ క్యాంపుల నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. ఎల్ఏసీ దగ్గర గస్తీ కాస్తోంది.
సరిహద్దులో చొరబాట్లను పెంచడం కోసం కమ్యూనిస్ట్ పార్టీలోని హన్ చైనీస్, టిబెటన్ సభ్యులను భారత సరిహద్దు దగ్గర మోహరిస్తోందని చైనా వ్యవహారాల పరిశీలకుడు బ్రహ్మ చెలానీ అన్నారు. దక్షిణ చైనా సముద్రంలో జాలర్లను ఎలా అయితే ఉపయోగించుకున్నదో.. ఇండియా పెట్రోలింగ్ నిర్వహించే హిమాలయ ప్రాంతాల్లో పశువుల కాపర్లను అలాగే వాడుకుంటోందని ఆయన వెల్లడించారు.
ఇప్పుడు అరుణాచల్కు దగ్గరలో చైనా నిర్మించిన గ్రామాలు.. దాదాపుగా తూర్పు లఢాక్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు నిర్మించినవే అని భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఆ ప్రాంతంలో 20 నిర్మాణాలతో తొలి గ్రామాన్ని నిర్మించినట్లు ప్లానెట్ ల్యాబ్స్ నుంచి పొందిన ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్మాణాలను చూస్తుంటే.. త్వరలో మరో డోక్లాం తరహా పరిస్థితి రావొచ్చని భావిస్తున్నారు.