3 రాజధానులు సరే.. మరి భూములిచ్చిన రైతుల మాటేంటి?

3 రాజధానుల పేరిట పరిపాలన వికేంద్రీకరణ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. అయితే ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం వుందంటున్నారు బిజెపి నేతలు. ఇంకా ఎంత కాలం ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర రాజధానిపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ లేకుండా వ్యవహరించడం వల్లనే అయిదేళ్ళ తర్వాత కూడా సందిగ్ధత కొనసాగుతోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. బిజెపి నేతలు జివిఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణు వర్ధన్ […]

3 రాజధానులు సరే.. మరి భూములిచ్చిన రైతుల మాటేంటి?
Follow us

|

Updated on: Dec 18, 2019 | 12:32 PM

3 రాజధానుల పేరిట పరిపాలన వికేంద్రీకరణ ప్రతిపాదనను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. అయితే ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రావాల్సిన అవసరం వుందంటున్నారు బిజెపి నేతలు. ఇంకా ఎంత కాలం ఏపీ రాజధాని విషయంలో సందిగ్ధ పరిస్థితి కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర రాజధానిపై గతంలో చంద్రబాబు ప్రభుత్వం క్లారిటీ లేకుండా వ్యవహరించడం వల్లనే అయిదేళ్ళ తర్వాత కూడా సందిగ్ధత కొనసాగుతోందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. బిజెపి నేతలు జివిఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, విష్ణు వర్ధన్ రెడ్డి, టిజి వెంకటేశ్ తదితరులు ఏపీకి మూడు రాజధానులు వుండొచ్చు అన్న ముఖ్యమంత్రి జగన్ ప్రకటనపై స్పందించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను బిజెపి నేతలు స్వాగతించారు. అయితే అమరావతిలోను హైకోర్టు బెంచ్ వుండాలని అంటున్నారు కమల నాథులు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయొచ్చని, కానీ అమరావతిలోనే లిజిస్లేచర్ క్యాపిటల్‌తోపాటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వుండాల్సిన అవసరం వుందని, ఈ రెండు వేరు వేరు చోట్ల వుండడం కరెక్టు కాదని అంటున్నారు కమలం నేతలు.

రాజధాని ఒకటే వుండాలని, పరిపాలన వ్యవహారాలను మూడు చోట్ల ఏర్పాటు చేయవచ్చని బిజెపి నేతలు చెబుతున్నారు. రాజధాని అంటే ఒకటే సిటీ అన్న అభిప్రాయం వుంటుంది కాబట్టి.. ముందుగా రాజధాని ఒకటే ప్రకటించి… మూడు ప్రాంతాల్లో వాటికి సంబంధించిన భవనాల వికేంద్రీకరణ జరిగితే బావుంటుందని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని ఎక్కడ అనేది పరిపాలన పరంగా తీసుకోవాల్సిన నిర్ణయమని, దీన్ని రాజకీయ కోణంలోను, సామాజిక వర్గాల ప్రాతిపదికన చూడడం కరెక్టు కాదని చెబుతున్నారు. రాజధాని అమరావతినే కొనసాగిస్తూ.. కర్నూలు, విశాఖపట్నం, తిరుపతిలలో ప్రధాన ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలంటున్నారు బిజెపి నేతలు.

తొందరపాటుతో, రాజకీయ అవసరాల కోసం రాజధానిపై నిర్ణయం తీసుకోవద్దని, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ప్రజల సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు జివిఎల్, కన్నా.