బీహార్ బీజేపీదేనా ? కాషాయ ప్రభంజనం, ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ ?
బీహార్ లో మొట్టమొదటిసారిగా బీజేపీ అతిపెద్దఏకైక పార్టీగా అవతరించబోతోంది. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఓటర్లు తమ కసిని చూపి చాలాచోట్ల కమలనాథులకు పట్టం కడుతున్నారు.
బీహార్ లో మొట్టమొదటిసారిగా బీజేపీ అతిపెద్దఏకైక పార్టీగా అవతరించబోతోంది. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై ఓటర్లు తమ కసిని చూపి చాలాచోట్ల కమలనాథులకు పట్టం కడుతున్నారు. 243 స్థానాలున్న రాష్ట్ర శాసన సభలో ఎన్డీయే హాఫ్ మార్క్ దాటుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలోని విపక్ష కూటమి..మహాఘట్ బంధన్ మొదట లీడింగ్ లో ఎన్డీయేకి గట్టి పోటీనిచ్చినా ఆ తరువాత వెనుకబడింది. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయానికి ఎన్డీయే 128 సీట్లలో, మహాఘట్ బంధన్ 100 స్థానాల్లో, లీడింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ 74 స్థానాల్లో, జేడీ-యూ 48, ఎల్ జె పీ 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఆర్జేడీ 61, కాంగ్రెస్ 21, లెఫ్ట్ పార్టీలు 13 చోట్ల లీడ్ లో ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ ను బట్టి అప్పుడే ఓ నిర్ధారణకు రాలేమని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు 10 శాతం మాత్రమే లీడింగ్ ట్రెండ్ తెలిసిందని, నిజానికి ఇది 30 శాతం పైగా ఉండవలసిందని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి. 65 కి పైగా సీట్లలో ఎన్డీయే, మహాఘట్ బంధన్ మధ్య ఆధిక్యాల్లో స్వల్ప తేడా మాత్రమే కనిపించింది. 30 చోట్ల మార్జిన్ లీడ్ 500 ఓట్లకన్నా తక్కువ ఉండగా 37 స్థానాల్లో లీడ్ 500-1000 మధ్య ఉంది.
కాగా రాఘో పూర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ ఆధిక్యంలో ఉండగా, హసన్ పూర్ నియోజకవర్గంలో ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తన సమీప ప్ప్రత్యర్ధి, జేడీ-యూ అభ్యర్థి రాజ్ కుమార్ రే కన్నా వెనుకబడి ఉన్నారు.