పార్లమెంట్ వేదికగా ఏపీలో పెట్టుబడులపై టీడీపీ – వైసీపీల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్రాలన్నీ పోటీపడుతుంటే.. ఏపీలో లక్ష 80వేల కోట్లు వెనక్కు పోయాయని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చాకే ఆర్ధికంగా నిలదొక్కుకోవడంతో పాటు.. ఉపాథి అవకాశాలు మెరుగుపడ్డాయంటున్నారు ఏపీ మంత్రులు. మీడియా కథనాలతో పార్టీల ఫోకస్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్… ఫైనాన్స్ వ్యవహారాలపైకి మళ్లింది.
అంతర్జాతీయ మీడియా వార్త ఒకటి ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కియా సంస్థ తరలిపోతుందంటూ రాయిటర్స్ కథనం సెగలు పార్లమెంటునూ తాకాయి. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడుతుంటే.. ఏపీలో కంపెనీలు పారిపోయేలా చేస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. విశాఖలోనూ 18వేల మంది ఉద్యోగులున్నకంపెనీలను ఖాళీ చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే టీడీపీ ఎంపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.
ప్రధాని మోదీ కృషివల్లే ఏపీకి కియా వచ్చిందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. త్వరలో కియా విస్తరణకు సిద్దమవుతున్న సమయంలో టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా తరలిపోతోందన్న వార్త వెనుక ఎవరో ఉన్నారన్న ఆర్థిక మంత్రి బుగ్గన.. తామెక్కడికీ వెళ్లడం లేదని కంపెనీయే క్లారిటీ ఇచ్చిందన్నారు. ఇక విశాఖ మిలీనియం టవర్స్లో కంపెనీలు ఖాళీ చేయమని ఎవరీకీ నోటీసులు ఇవ్వలేదన్నారు.
వైసీపీ నాయకుల వార్నింగులు.. మంత్రుల బెదిరింపుల కారణంగానే కంపెనీలు పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు మాజీ సీఎం చంద్రబాబు. పీపీఏ ఒప్పందాలపై జపాన్ రాయభారి లేఖ రాయడం నిజం కాదా అని ప్రశ్నించారు. కియా కంపెనీ వల్ల రాష్ట్రానికి 20వేల కోట్ల భారమని మంత్రి ప్రకటించారు.. ఎంపీ వేలు పెట్టి బెదిరించారు.. ఉద్యోగాలు ఇవ్వాలంటూ స్థానిక నేతలు బ్లాక్ మెయిల్ చేశారు.. అందుకే కియా పునరాలోచనలో పడిందన్నారు చంద్రబాబు.