
తన కారులో ముగ్గురు హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులను శ్రీనగర్ నుంచి ఢిల్లీకి తరలిస్తూ.. పోలీసులకు పట్టుబడిన డీఎస్పీ దేవేందర్ సింగ్ కు 2001 లో పార్లమెంటుపై జరిగిన దాడి ఘటనతోనూ లింక్ ఉందా అన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించారు. దేవేందర్ ను గత శనివారం అరెస్టు చేసిన సంగతి విదితమే.. ఆనాడు పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురును స్వయంగా సింగే ఢిల్లీకి పంపాడన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఇతనికి, అఫ్జల్ గురుకు మధ్య సంబంధాలు ఉన్నట్టు నాడు ఓ లేఖ ద్వారా వెల్లడైంది. తనను ఉరి తీసేముందు అఫ్జల్ గురూయే ఈ లెటర్ ను విడుదల చేశాడు.
2017 ఆగస్టులో పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిని ‘ సాహసోపేతంగా ‘ ఎదుర్కొన్నందుకు దేవేందర్ సింగ్ కు ‘ షేర్-ఎ-కాశ్మీర్’ పోలీసు మెడల్ లభించింది. ఆ ఎటాక్ లో నలుగురు పోలీసులు కూడా మరణించారు. అయితే ఈ దాడిని సింగే ప్రోత్సహించాడా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అటు-ఈ అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్టు కాశ్మీర్ అధికారులు ప్రకటించారు. దేవేందర్ సింగ్ ను కాశ్మీర్-సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ అధికారులు కూడా సంయుక్తంగా ఇంటరాగేట్ చేస్తున్నారు.