వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు .. అనుమానితుల లిస్ట్ లో 15 మంది..!
మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నేటి నుంచి కడప కేంద్రంగా కీలక విచారణ సాగనుంది.
YS Viveka murder case : మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నేటి నుంచి కడప కేంద్రంగా కీలక విచారణ సాగనుంది. 10 రోజులపాటు పులివెందులలో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు.. వివేకా ఇంటిని జల్లెడ పట్టారు. అణువణువు పరిశీలించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. వివేకా ఇంటి వాచ్ మెన్, ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ, డ్రైవర్ ప్రసాద్ సహా పలువురుని విచారించారు. కాగా ఆదివారం సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 బ్యాగుల్లో ఉన్న నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ ఆఫిసర్స్.. ఈరోజు నుంచి ప్రత్యేక విచారణ అధికారి నేతృత్వంలో విచారణ జరుపనున్నారు. ఈ క్రమంలో కడప ఆర్అండ్బీ సెంట్రల్ జైలులోని అతిథి గృహానికి అధికారులు చేరుకున్నారు.
Read More : సీమలో చినుకుల సందడి..ఎన్నడూ లేనంతగా వర్షాలు..
అక్కడే నివేదికలు పరిశీలించి.. అనుమానితులను పిలిపించి విచారించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 15 మంది అనుమానితుల లిస్ట్ రెడీ చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.