కుదరని ఏకాభిప్రాయం.. స్పష్టత ఇస్తేనే ముందు..
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఆర్టీసీ ఎండీల భేటీలోనూ చర్చలు కొలిక్కిరాలేదు. దీంతో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది....
ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అయిన తర్వాతే బస్సులకు అనుమతి ఇస్తామని TSRTC తెలిపింది. ఏపీ బస్సులు, తెలంగాణ భూభాగంలో 2 లక్షల 65 వేల కిలోమీటర్లు తిరుగుతుండగా, తెలంగాణ బస్సులు ఏపీలో లక్షా 52 వేల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతున్నాయి. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం ఇరు రాష్ట్రాలు సమాన కిలోమీటర్లు మాత్రమే బస్సులు నడుపుకోవాలి. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉండటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలా బస్సులు తిరిగాయో ఇప్పటి వరకు అలాగే కొనసాగాయి. అయితే లాక్డౌన్లో బస్సు సర్వీసులు ఆగిపోవడంతో పనిలో పనిగా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కూడా తేల్చుకోవాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించుకుంది .
హైదరాబాద్లోని ఆర్ అండ్ బీ భవన్లో ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు, ఈడీలు సమావేశమై ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణ, కిలోమీటర్ అంశాలపై చర్చలు జరిపారు. ఏయే రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై చర్చించారు. రూట్ల వారీగా స్పష్టత ఇస్తేనే తాము ముందుకెళ్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. సమావేశం తర్వాత ఆర్టీసీ ఎండీలు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2.65 లక్షల కిలోమీటర్లకు బస్సులు తిరుగుతున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు చెప్పారు. ఏపీ 71 రూట్లలో, తెలంగాణ 28 రూట్లలో తిప్పుతోందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య లక్షా 10వేల కిలోమీటర్ల వ్యత్యాసం ఉందని చెప్పారు. తాము 50 వేల కి.మీ తగ్గిస్తామని.. తెలంగాణ పెంచుకోవాలని ప్రతిపాదించినట్లు కృష్ణబాబు తెలిపారు. లక్షా 10వేల కిలోమీటర్ల నుంచి లక్షా 60 వేల కిలోమీటర్ల వరకు పెంచేందుకు తెలంగాణ ముందుకొచ్చిందని, అంతకుమించి పెంచే సామర్థ్యం తమకు లేదని చెబుతోందన్నారు. అలా చేస్తే లాభదాయకంగా ఉండదని సమావేశంలో టీఎస్ ఆర్టీసీ అధికారులు చెప్పినట్లు ఆయన వివరించారు.
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉందన్నారు. ఇతర రాష్ట్రాల రూట్ వైజ్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ కోరిందని.. ఇప్పటి వరకు ఏ రాష్ట్రమూ ఇలాంటి ప్రతిపాదన పెట్టలేదన్నారు. రెండు రాష్ట్రాల బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ప్రైవేటు బస్సులకు లాభం చేకూరుతుందని కృష్ణబాబు చెప్పారు. రూట్ల వారీగా బస్సులు నడిపే మార్గాల ప్రతిపాదనలను తెలంగాణ అడిగిందని.. రెండు రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అయితే – రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా బస్సులు నడపాలని తాము ప్రతిపాదించామన్నారు తెలంగాణ ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ. రూట్ల వారీగా స్పష్టత ఇస్తే దానికి అనుగుణంగా తాము ముందుకెళ్తామని ఆయన చెప్పారు. అగ్రిమెంట్ జరిగిన తర్వాతనే బస్సులు నడుపుతామని TSRTC MD సునీల్శర్మ స్పష్టం చేశారు.