Amazon Academy For JEE: లాక్డౌన్ సమయంలో కాలేజీలు, స్కూళ్లు మూతపడడంతో ఆన్లైన్ తరగతులకు ఆదరణ బాగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ ధరలు కూడా అందుబాటులోకి రావడంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అందరికీ చేరువవుతోంది. ఈ తరుణంలో బడా కంపెనీలు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్పై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే బైజూస్, అన్అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలు ఇందులో దూసుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే మరో బడా ఈ కామర్స్ కంపెనీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ రంగంలోకి అడుగుపెట్టింది.
ఇందులో భాగంగానే అమేజాన్ ఇండియా.. ‘అమెజాన్ అకాడమీ’ పేరుతో జేఈఈ పరీక్షలకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు అవసరమైన ఆన్లైన్ వేదికను ప్రారంభించింది. గూగుల్ప్లే స్టోర్లో బీటా వర్షన్ యాప్ ఉచితంగా అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బైజూస్, అన్అకాడమీ, వేదాంతు వంటి కంపెనీలకు ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ఇండియా (ఎడ్యుకేషన్) డైరెక్టర్ అమోల్ గుర్వారా తెలిపారు. జేఈఈతో పాటు బీఐటీఎస్ఏటీ, వీఐటీఈఈఈ, ఎస్ఆర్ఎంజేఈఈఈ, ఎంఈటీ పరీక్షల విద్యార్థులకు కూడా నాణ్యమైన కంటెంట్ అందుబాటులో ఉందని తెలిపారు. ఇక కొన్ని నెలల వరకు ఉచితంగా సేవలు అందుబాటులో ఉండనున్నాయని సంస్థ తెలిపింది. భవిష్యత్తులో చార్జీలు వసూలు చేయనున్నారు. కరోనా కారణంగా మారుతోన్న విద్యా వ్యవస్థ ఇంకెన్ని మార్పులకు లోనవుతుందో చూడాలి.
Also Read: అమెజాన్ ఐడియా అదిరిపోలే? అసలు విషయాన్ని చెప్పడానికి క్రియేటివిటిగా ఏం చేసిందో తెలుసా..