Agrigold : అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 23న ఆ డెరెక్టర్లను ఈడీ కోర్టులో హాజరు పర్చింది. నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన న్యాయ స్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
అగ్రిగోల్డ్ డైరెక్టర్లంతా కలిసి రూ. 6,400 కోట్లు స్కామ్కు పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం అడ్డంగా ముంచింది. అలా వచ్చిన సొమ్ముతో మనీ ల్యాండరింగ్కు పాల్పడ్డారు. కాగా, అగ్రిగోల్డ్ స్కామ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దీంట్లో పెట్టుబడి పెట్టి ఎంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది అయితే నష్టపోయామనే మనస్తాపంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ నాటి ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని సూచించింది.