ఏపీలో ఒకేరోజు రెండు దారుణాలు.. ఇద్దరు ఆరేళ్ల చిన్నారులపై అఘాయిత్యాలు

|

Nov 03, 2020 | 5:10 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన అభం శుభం తెలియని చిన్నారులను కాపాడలేకపోతున్నాయి. మాయమాటలు చెప్పి ముక్కుపచ్చలారని చిన్నారులను కామాంధులు చిదిమేస్తున్నారు.

ఏపీలో ఒకేరోజు రెండు దారుణాలు.. ఇద్దరు ఆరేళ్ల చిన్నారులపై అఘాయిత్యాలు
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన అభం శుభం తెలియని చిన్నారులను కాపాడలేకపోతున్నాయి. మాయమాటలు చెప్పి ముక్కుపచ్చలారని చిన్నారులను కామాంధులు చిదిమేస్తున్నారు. కన్నుమిన్ను కానని కీచకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో ఆరేళ్ల వయసు కలిగిన ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓ బాలుడు (14) ఈ ఆకృత్యానికి తెగబడితే, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ కామాంధుడు (28) ఈ దారుణానికి ఒడిగట్టాడు.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ఓ గ్రామంలో మేనమామ ఇంటికి విశాఖ జిల్లా నక్కపల్లి మండలానికి చెందిన ఓ బాలుడు (14) వచ్చాడు. ఆదివారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ బాలికను (6) ఇంటిపక్కన డాబాపై ఆరేసిన దుస్తులు తీసుకువద్దామని చెప్పి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక అరుపులు విని మిగతా పిల్లలు రావడంతో అతను పారిపోయాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని వైద్యం నిమిత్తం ఏలేశ్వరం సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

అటు, చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటివద్ద ఒంటరిగా ఉంది. ఇదీ గమనించిన అదే గ్రామానికి చెందిన మహేష్‌ (28) ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాత్రి నిద్రపోయే సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావం కావడాన్ని గుర్తించి తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అనంతరం బాలికను పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.