
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా గ్రేటర్ పరిధిలో 147 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోనే 36 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ 36 మందిలో ఆస్పత్రి సిబ్బందితో పాటు మానసిక రోగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిందరిని అక్కడే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా కేర్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో కొనసాగుతున్న కొవిడ్ సెంటర్లో ఇప్పటివరకు దాదాపు 200 మంది చికిత్స పొందుతున్నారు.
అటు, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 57,981 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 941 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 26 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 50 వేలు దాటింది.