TV9 Focus: నాన్న కళ్ళతో చూసిన భవిష్యత్ కరోనా కాటుతో కనిపించకుండా పోయింది.. కన్నీటి కథలపై ప్రత్యేక కథనం!

TV9 Focus: కరోనా అంటే ఒక వ్యాధి కాదు. అది బాంధవ్యాలను బలితీసుకునే మహమ్మారి. కరోనా కాటుకు పోయిన ప్రాణం చుట్టూ చీకట్లోకి జారిపోయే జీవితాలు ఎన్నో. రేపటి తన భవిష్యత్ చూపించాల్సిన నాన్న

TV9 Focus: నాన్న కళ్ళతో చూసిన భవిష్యత్ కరోనా కాటుతో కనిపించకుండా పోయింది.. కన్నీటి కథలపై ప్రత్యేక కథనం!
Tv9 Focus

Edited By:

Updated on: Jun 09, 2021 | 5:03 PM

TV9 Focus: కరోనా అంటే ఒక వ్యాధి కాదు. అది బాంధవ్యాలను బలితీసుకునే మహమ్మారి. కరోనా కాటుకు పోయిన ప్రాణం చుట్టూ చీకట్లోకి జారిపోయే జీవితాలు ఎన్నో. రేపటి తన భవిష్యత్ చూపించాల్సిన నాన్న.. కడుపున దాచుకుని పెంచే అమ్మ ప్రేమ.. నిన్నటివరకూ తనతో ఆడుతూ తిరిగిన అన్న.. ప్రేమగా చూసుకునే అక్క ఇలా కుటుంబంలో ఎవరినో ఒకరిని కరోనా తీసుకుపోతే.. మిగిలిన వారి మనోవ్యధను తీర్చడం ఎవరి తరం. కరోనా మిగిలుస్తున్న కన్నీరు ప్రపంచానికి కనిపించేలా చేస్తోంది టీవీ9. హృదయాలను కదిలించే కరోనా కన్నీటి గాధలను వెలుగులోకి తీసుకువచ్చి.. జీవితానికి ఆసరగా ఉన్నవారు దిగంతాలకు వెళ్ళిపోతే దిక్కెవరు అని రోదిస్తున్న వారికి నేనున్నాను అనే ధైర్యాన్నిస్తోంది టీవీ9. కరోనా కన్నీటి కధలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ.. వారికోసం ఆపన్న హస్తం అందించేవారిని పరిచయం చేస్తోంది టీవీ9. అదిగో అలాంటి కథనాల్లో ఒకటి ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే కన్నీటి వ్యధ.

అమ్మాయిలకు ఎప్పుడూ నాన్నే హీరో..! కానీ ఆ హీరోను కరోనా మింగేసింది. ఆ పోస్ట్‌ మాస్టర్‌ కుటుంబంలో కరోనా మహమ్మారి విషాదం మిగిల్చింది. కని.. పెంచి.. పెద్ద చేసిన తండ్రిని.. ఫొటో ఆల్బమ్‌లో జ్ఞాపకంగా చూసుకుని.. ఆ ముగ్గురు కూతుళ్లు తల్లడిల్లుతున్నారు. ఇప్పుడు వారి చదువులెలా? పెళ్లిళ్లు పేరంటాలు ఎలా చేయాలని? అమ్మ మనసు ఆక్రోసిస్తోంది..! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఊరు ఊరునా కన్నీటి కథ..! ఇంటింటా కరోనా మిగిల్చిన వ్యథ!!

అందాల ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా విలయం సృష్టిస్తోంది. ముచ్చటైన కుటుంబాల్లో దుఃఖం ముసురుతోంది.. ఇంటి పెద్దను కోల్పోయి అంతులేని శోకంతొ తల్లడిల్లేలా చేస్తోంది. ఇదిగో ఇది ఓ పోస్టుమాస్టర్ మృతి లేపిన కల్లోలం. వేమనపల్లి మండలం కేతనపల్లికి చెందిన పోస్టు మాస్టర్ శంకరయ్య మరణం గ్రామంలో విషాదాన్ని నింపింది. ముగ్గురు బిడ్డలతో సంతోషంగా సాగిపోతున్న జీవితంలో కరోనా చీకట్లు చిమ్మింది. అమ్మా..నాన్న..ముగ్గురు ఆడపిల్లలు. కని పెంచి పెద్ద చేసిన తండ్రి ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలాడు..! కరోనాకు బలై..కళ్లలో దుఃఖమై పొంగుతున్నాడు..!

నాన్న ఉంటే చాలు.. నాన్న బతికుంటే చాలు..

అందుకే బిడ్డ పెళ్లి కోసం దాచిన మూడు లక్షలకుతోడు మరో మూడు లక్షలు అప్పుచేసి కరోనా రక్కసి కోరల నుంచి శంకరయ్యను రక్షించుకోవాలని ఖర్చుపెట్టారు. కానీ, ఇంటి పెద్ద ప్రాణం దక్కలేదు. కరోనాతో పోరాడి ఓడిన పోస్ట్‌మాస్టర్‌ శంకరయ్య..మే 9న మరణించారు. కేతన్‌పల్లి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసిన శంకరయ్య కష్టపడి కూతుళ్లను చదివించారు. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేవారు. పెద్ద కూతురుకు పెళ్లి చేసేందుకు సిద్ధపడుతున్న తరుణంలో..ఈ ఇంట విషాదం చోటు చేసుకుంది.
మాకున్న ఆధారం మా నాన్నే..ఇప్పుడు ఆయన కూడా లేరు అన్న కూతురు మాటలు కదిలిస్తున్నాయి. నాన్న ఎప్పుడూ అంతే..! ఏమీ చెప్పడు..! ఎన్ని కష్టాలు పడినా.. పిల్లలకు ఏ లోటూ రాకూడదనుకుంటాడు. కానీ ఆ తండ్రి అర్ధంతరంగా దూరమైతే..ఆ కుటుంబ పరిస్థితి దారుణం! పిల్లల చదువులు, పెళ్లిళ్లు..చేసిన అప్పులు..ఇన్ని బాధ్యతలు ఎలా మోయాలో తెలియక ఈ ఇల్లాలు కుమిలిపోతోంది.

కరోనా ఇటువంటి కష్టాలను ఎన్నిటినో ప్రజలకు తీసుకువస్తోంది. కుటుంబ పెద్ద చనిపోయిన బాధలో ఉన్న శంకరయ్య కుటుంబాన్ని చూస్తె గుండె బరువవ్వని మనిషి ఉండడు. శంకరయ్య మరణంతొ ఆ కుటుంబ వేదనను ప్రపంచానికి చూపించిన టీవీ9 కరోనా కన్నీటి కథల కథనం ఇక్కడ మీరూ చూడండి.. ఇటువంటి వారికి ఆసరాగా నిలబడే ప్రయత్నం చేయండి.

  • TV9 తెలుగులో ప్రసారమైన మరిన్ని కన్నీటి కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: TV9 Campaign Vaccinate All: వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు.. దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందాలన్నదే టీవీ 9 నినాదం..

TV9 Exclusive: ప్రాణాలు తీసేస్తున్న రక్తం కొరత..నిండుకున్న బ్లడ్ బ్యాంకుల పరిస్థితిపై టీవీ9 ప్రత్యేక కథనం

Loading...
Unable to load recommendations.
Follow Us