అసలే సండే.. ఆపై స్పెషల్ ఆఫర్. ఇంకేముంది జనం ఎగబడ్డారు. మటన్ కొనేందుకు పెద్ద పెద్ద క్యూలు కట్టారు. కిలో మటన్ కొంటే తగ్గింపు ధరతోపాటు స్పెషల్ గిఫ్టు కూడా ఇచ్చారు. ఈ ఆఫర్ రెడీ చేసిన మటన్ షాప్ యజమానులు ముందే ప్రచారం చేశాడు. దీనికి తోడు సండే రోజు ఈ ఆఫర్ ఉంటుందన్న సమాచారం ఈ నోట, ఆ నోట ఆ ప్రాంతంలో ఉండే వారందరికి చేరిపోయింది. అంతే సండే రోజు ఉదయాన్నే షాప్ ముందు జనం బారులు తీరారు. ఉదయం మొదలైన సందడి సాయంత్రం వరకు సాగింది.
ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పోటీ మటన్ ప్రియులకు లాభం చేకూర్చింది. కేజీ రూ. 800 పలుకుతున్న మటన్, ఒకరు కేవలం 497 రూపాయలకు, మరొకరు 498 రూపాయలకి ఇంకొకరు విక్రయించడంతో మటన్ ప్రియులు ఎగబడి కొన్నారు. ఒకరు కేజీ మటన్కు రెండు చాక్లెట్లు ఉచితంగా ఇస్తే, మరొకరు కేజీ మటన్ కు మసాలా ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చారు.
కడప జిల్లాలోని మైదుకూరులో మటన్ విక్రయాలు భలే రంజుగా జరిగాయి. ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పోటీ చిలికి చిలికి గాలి వాన లాగా మారి కేజీ మటన్ 498 రూపాయలకి ఒకరు అమ్మగా, నీకంటే ఒక రూపాయి తక్కువకే అమ్ముతానని పందెం మీద 497 రూపాయలకే మరో వ్యాపారి మటన్ విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న మటన్ ప్రియులు చుట్టు పక్కల ఊర్లకు చెందిన జనం ఆ రెండు మటన్ షాపుల వద్దకు ఎగబడి వెళ్లారు. సంతలో గొర్రెలు, మేకలనుకునే దగ్గర ఈ ఇద్దరు వ్యాపారస్తుల మధ్య మాటకు మాట పెరిగి పోటీ రావడంతో పందానికి ఇద్దరు మాంసం విక్రయదారులు అతి తక్కువ ధరకు మటన్ విక్రయించారు.
498 రూపాయలకు అమ్మిన మటన్ షాపు యజమాని కస్టమర్లకు రెండు చాక్లెట్లను ఉచితంగా ఇవ్వగా, 497 రూపాయలకే కేజీ మటన్ వినియోగదారులకు అమ్ముతూ, కేజీ మటన్ కొన్నవారికి మసాలా ప్యాకెట్ ఫ్రీగా ఇచ్చాడు. దీంతో స్థానికులే కాకుండా చుట్టుపక్కల ఊర్లకు చెందిన జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎగబడి మరీ మటన్ కొనుగోలు చేశారు. దీంతో ఉదయం ఎనిమిదిన్నర గంటలకే ఇద్దరి వద్ద మటన్ అయిపోయింది. ఒకరి మీద కోపం, మరెవరికో కలిసి వచ్చినట్టు.. ఇద్దరు వ్యాపారుల మధ్య తగువు మటన్ ప్రియులకు కలిసి వచ్చింది. రూ. 500 లోపు మటన్ రావడంతో హాయిగా కొనుక్కొని మటన్ ప్రియులు సంబరపడ్డారు. దొరకని వారు అయ్యో అప్పుడే మటన్ అయిపోయిందా అని ఊసురుమంటూ వెనుతిరిగారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…