Bird Rescue: దీపావళి పర్విదినాన గుడ్లగూబను బలి ఇస్తే సంపద రెట్టింపు అవుతుందా..?

ప్రతి దీపావళి సమయంలో గుడ్లగూబకు విపరీతంగా ధరలు ఉండడంతో బహేలియా తెగకు చెందిన కొంతమంది చిన్న పిల్లలుగా ఉన్న సమయంలో గుడ్లగూబలను పట్టుకొచ్చి పెద్దయ్యేంత వరకు పెంచుతుంటారు. గుడ్లగూబ ఇదో ప్రత్యేకమైన పక్షి.. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పక్షి జాతి అంతరించిపోతోంది. దీనికి కారణం.. అరుదైన వ్యాధి సోకడమో..

Bird Rescue: దీపావళి పర్విదినాన గుడ్లగూబను బలి ఇస్తే సంపద రెట్టింపు అవుతుందా..?
Owls Are Facing Extreme Threat During Deepavali Due To Superstitious Belief

Edited By: TV9 Telugu

Updated on: Nov 14, 2023 | 6:47 PM

గుడ్లగూబ ఇదో ప్రత్యేకమైన పక్షి.. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పక్షి జాతి అంతరించిపోతోంది. దీనికి కారణం.. అరుదైన వ్యాధి సోకడమో.. లేక రేడియేషన్ ఎఫెక్టో కాదు.. ఈ పక్షి జాతి పాలిట మానవ స్వార్థం.. మూఢనమ్మకాలే శాపలుగా మారాయి. నిజానికి తాంత్రిక పూజల్లో కీలక పాత్ర గుడ్లగూబదేనంటూ ప్రచారం లేకపోలేదు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా గుడ్లగూబ స్మగర్ల ముఠా రెచ్చిపోతోంది. వాస్తవానికి ప్రతి ఏటా దీపావళి సమయంలో గుడ్లగూబ ధర అమాంతం ఆకాశానికి చేరుతుంది. గుడ్లగూబను కొంతమంది లక్ష్మీవాహనంగా భావిస్తే.. మరికొంతమంది అపశకునంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే దీపావళి అమవాస్య రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనే మూఢనమ్మకంతో తాంత్రిక విద్య పేరుతో గుడ్లగూబలను బలివ్వడం కొంతమంది అనవాయితీగా పాటిస్తూ వస్తున్నారు. మరికొన్ని తెగల్లో సాధారణ అమావాస్య రోజుల్లో తాంత్రిక పూజల్లో భాగంగా గుడ్లగూబను బలిస్తుంటారు. కానీ దీపావళి సమయంలో మాత్రం ఉత్తర భారతదేశంలో వీటికి మస్తు డిమాండ్ ఉంటుంది.

ఒక్కో గుడ్లగూబకు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు డిమాండ్ పలుకుతుంది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో దీని ధర రూ.300లకు మించదు. కొన్ని గ్రామాల్లోనైతే.. దాన్ని తాకేందుకు కూడా ఇష్టపడరు. దీపావళి అమావాస్యకు మూఢనమ్మకంతో లక్ష్మీపూజ రాత్రి గుడ్లగూబను బలివ్వడంతో వచ్చే ఏడాది వరకు సిరిసంపదలు, సుఖసంతోషాలతో ఆ ఇల్లు తులతూగుతుందని కొందరి నమ్మకం. ప్రధానంగా రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లో గుడ్లగూబకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మగ్లర్ల ముఠా జైపూర్, అల్వర్, ఫతేపూర్ సిక్రీ, భరత్ పూర్ తదితర గ్రామీణ ప్రాంతాల్లోని కోరాయీ- కరావ్లీ, మధుర చుట్టూపక్కనున్న కోసీ- కలా తదితర గ్రామాల్లో పెద్దఎత్తున గుడ్లగూబ వ్యాపారం రహస్యంగా ఏండ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది.

ప్రత్యేకంగా గుడ్లగూబల పెంపకం..
ప్రతి దీపావళి సమయంలో గుడ్లగూబకు విపరీతంగా ధరలు ఉండడంతో బహేలియా తెగకు చెందిన కొంతమంది చిన్న పిల్లలుగా ఉన్న సమయంలో గుడ్లగూబలను పట్టుకొచ్చి పెద్దయ్యేంత వరకు పెంచుతుంటారు. గుడ్లగూబ సైజును బట్టి ధర పెడుతుండడం వల్ల వాటిని ప్రత్యేకంగా పోషిస్తుండడం గమనార్హం. అయితే గుడ్లగూబలో ప్రత్యేకత ఏంటంటే.. కండ్ల నుంచి మాంసం వరకు ప్రతి భాగాన్ని తాంత్రిక పూజల్లో వినియోగిస్తారనే ప్రచారం లేకపోలేదు.

ఈ క్రమంలోనే దీపావళికీ గుడ్లగూబలను విక్రయిస్తున్న వడోదరాకు చెందిన ఓ స్మగ్లర్ల ముఠాను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వన్యప్రాణుల రక్షణ బృందంతో పాటు గుజరాత్ అటవీశాఖ, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా అవధా గ్రామంలో ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దగ్గరి నుంచి రెండు బెంగాల్ గుడ్లగూబలతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరోవ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు.

మూఢనమ్మకాలతోనే గుడ్లగూబల బలి..
వాస్తవానికి గుడ్లగూబలను బలిస్తే.. లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందనే భ్రమతో వందలాది గుడ్లగూబలను బలివ్వడం రహస్య అనవాయితీగా వస్తోంది. కానీ గుడ్లగూబలను బలి ఇవ్వడం వల్ల ఏలాంటి ప్రయోజనం ఉండబోదని ఇప్పటికే పలువురు సామాజిక వన్యప్రాణ రక్షకులు చెబుతూ వస్తున్నారు. నిజానికి గుడ్లగూబలకు ఏలాంటి మంత్ర శక్తులు ఉండవు. ప్రతి దీపావళికి వందల సంఖ్యలో గుడ్లగూబలను బలిస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని వన్యప్రాణ సంరక్షులు ఆరోపిస్తున్నారు.