హుండీలో పడిపోయిన ఐఫోన్.. దేవుడికే చెందుతుందంటున్న అధికారులు

తమిళనాడులోని ఓ ఆలయంలో విచిత్ర ఘటన జరిగింది. దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా అతని ఐఫోన్ అందులో పడిపోయింది. డిసెంబర్​ 18న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేయగా లెక్కింపు సమయంలో పిలుస్తామని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

హుండీలో పడిపోయిన ఐఫోన్.. దేవుడికే చెందుతుందంటున్న అధికారులు
Iphone Hundi

Updated on: Dec 22, 2024 | 4:12 PM

తమిళనాడు చెంగల్పట్టు జిల్లా తిరుపోరూర్‌లో ప్రసిద్ధ మురుగన్​ ఆలయంలో అనూహ్య ఘటన జరిగింది. మురుగన్ను ఇక్కడ గండస్వామిగా కొలుస్తారు. ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. కందసామి దేవాలయాన్ని ఈ ఆలయానికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా బయటి నుంచి కూడా నిత్యం వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే, తిరుపోరూర్ మురుగన్ ఆలయ హుండీలో పడిన ఐఫోన్‌ను ఇవ్వడానికి అధికారులు నిరాకరించిన ఘటన కలకలం రేపింది. తాజాగా ఆలయంలో బిల్వపత్రాల కార్యక్రమం జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి క్రతువుల సమయంలో డబ్బు, నగలు సమర్పిస్తారు. ప్రతి ఆరు నెలలకోసారి భక్తులు సమర్పించిన సొమ్మును ధర్మాదాయశాఖ అధికారుల సమక్షంలో లెక్కించడం ఆనవాయితీ. అయితే ఇలా లెక్కిస్తుండగా వారు ఐఫోన్ రాకను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే సెల్​ఫోన్​ను ధర్మాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రాజలక్ష్మి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమారవేల్ అనలిస్ట్ భాస్కరన్లకు అందజేశారు.

చివరికి నిరాశే..

ఈ ఐఫోన్ ఎవరిదని వారు విచారణ చేపట్టగా.. చెన్నైలోని వినాయకపురానికి చెందిన దినేశ్​దిగా గుర్తించారు. గత అక్టోబర్‌ 18న ఈ ఆలయంలోని హుండీలో పడినట్లు తెలుస్తోంది. ఆ రోజే ఫోన్​ గురించి ఆలయ పాలకమండలి, ధర్మాదాయ శాఖకు ఫిర్యాదు చేసి తన ఫోన్​ను తిరిగి ఇప్పించాలని కోరాడు. అయితే లెక్కింపు సమయంలో సమాచారం ఇస్తామని అధికారులు చెప్పారు. ధర్మాదాయ శాఖకు వినతిపత్రం అందించాడు. ఫోన్ అందజేయడంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పి వెనక్కి పంపించారు. ఫోన్ వస్తుందన్న సంతోషంతో తిరుపోరూర్ కూడా చేరుకున్నాడు. అయితే, అతనికి నిరాశే మిగిలింది. హుండీలో పడిన వస్తువులన్నీ స్వామికే చెందుతాయని ఆలయ పాలకవర్గం కఠినంగా చెప్పింది. అయితే, దినేశ్​ అధికారులు ఓ అవకాశం ఇచ్చారు. ఆ ఫోన్​లోని డేటాను మరొక ఫోన్‌కు బదిలీ చేసుకోవచ్చని చెప్పారు.

నెటిజన్ల విమర్శలు

ఈ ఘటన గురించి విన్న నెటిజన్లు ఆలయ నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలియక తప్పులు చేస్తే దేవుడు కూడా క్షమిస్తాడని, అధికారులు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us