
కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఇవి విపరీతమైన నొప్పిని, తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాల్షియం, ఆక్సలేట్ వంటి కొన్ని పదార్థాలు మూత్రంలో అధికంగా కనిపించి, మూత్రపిండాలలో పేరుకుపోవడం ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. లక్షణాలను ముందుగానే గుర్తించడం ద్వారా తీవ్రమైన నొప్పి, దీర్ఘకాలిక మూత్రపిండాల నష్టాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లలో లోపాలు ప్రధాన కారణంగా ఉన్నాయి.శరీరంలో తగినంత నీరు లేకపోవడం, అధిక ఉప్పు తీసుకోవడం మరియు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం వంటి వాటితో పాటు కొన్ని సందర్భాల్లో, వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.
మొదట్లో లక్షణాలను గుర్తించడం కష్టంగా ఉన్నప్పటికీ ఈ మూడు సంకేతాలు కిడ్నీలో రాళ్లకు స్పష్టమైన సూచనలు కావచ్చు:
మీ వీపులో ఒక వైపు లేదా పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తే, అది మూత్రపిండాల్లో రాళ్లకు సంకేతం కావచ్చు. ఈ నొప్పి స్థిరంగా ఉండకపోవచ్చు వస్తూ పోతూ ఉండవచ్చు. ముఖ్యంగా తక్కువ నీరు తాగడం వల్ల నొప్పి మరింత తీవ్రమవుతుంది.
మూత్రపిండాల్లో రాళ్ల యొక్క మరొక లక్షణం మూత్రంలో రక్తం కనిపించడం లేదా మూత్రం అసాధారణ రంగులో ఉండటం. మూత్రం సాధారణం కంటే గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపించవచ్చు.
ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా తరచుగా మీకు వికారం అనిపించినా లేదా వాంతులు అవుతున్నా, అది కూడా కిడ్నీలో రాళ్ల లక్షణం కావచ్చు.
ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే, తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..