
తెలుగు సినిమా చరిత్రలో సామర్ల వెంకట రంగారావు (SVR) పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. విశ్వనట చక్రవర్తి, నటసార్వభౌమ, నటసింహం వంటి బిరుదులు పొందిన ఎస్వీ రంగారావు, తన అద్భుతమైన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన నటన కోసం ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. ఎలాంటి పాత్రనైనా సరే అలవోకగా నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. అంతేకాదు, హీరోలకు మించిన స్టైల్, దర్పం ఆయన సొంతం. కృష్ణాజిల్లా నూజివీడులో 1918 జూలై మూడవ తేదీన జన్మించిన రంగారావు, మద్రాసు, ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో చురుకుగా పాల్గొన్నారు. చదువు పూర్తయిన తర్వాత కొద్ది రోజులు ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం చేసినా, నటనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన “వరూధిని” చిత్రం ఆయనకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఆ చిత్రం విజయవంతం కాకపోవడంతో కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్లీ సినిమా అవకాశాలు రావడంతో తిరిగి సినీ రంగానికి వచ్చి, దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు.
రావణుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు వంటి ప్రతినాయక పాత్రలలోనే కాక, అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళభైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతితో పాటు ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు. ఆరడుగుల పొడవుతో, అజానుబాహుడుగా ఉన్న రంగారావు తొలి నాళ్లలోనే ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు. పౌరాణిక సినిమాలలో నటించడం మొదలుపెట్టిన తర్వాత ఆయన దశ తిరిగింది. అప్పట్లో అగ్ర నటులైన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల కంటే అధికంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇస్తేనే తాను నటిస్తానని పట్టుబట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయట.
రంగారావు కేవలం గొప్ప నటుడుగానే కాకుండా, విశేషమైన అభిరుచులు ఉన్న వ్యక్తిగా కూడా పేరు పొందారు. ఆయన పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా వివేకానందుని రచనలు అంటే అపారమైన ప్రేమ. ఆయనకు ఉన్న మరో ఆసక్తికరమైన హాబీ ఫోటోగ్రఫీ.. ఆయన దగ్గర రకరకాల కెమెరాలతో పాటు ఒక 16mm కెమెరా కూడా ఉండేది. వేట కూడా ఆయనకు మరో విలక్షణమైన అభిరుచి. ఆయన దగ్గర ఒక బరువైన తుపాకీ ఉండేది, దాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసేవారట. దర్శకత్వంలోనూ ఎస్వీ రంగారావుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన చదరంగం, బాంధవ్యాలు వంటి చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని ప్రభుత్వ నంది అవార్డులు కూడా పొందాయి. నటుడిగా ఎంతో డిమాండ్ ఉన్నా, పారితోషకం విషయంలో మాత్రం ఉదారంగా ఉండేవారు. తన జీవితంలో ఒక నిజమైన రారాజులా వెలిగిన ఎస్వీ రంగారావుకు పద్మశ్రీ వంటి పురస్కారాలు లభించకపోయినా, నేటికీ ఆయన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు. 1974లో 56 ఏళ్ల వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయన చివరి చిత్రం యశోదకృష్ణ 1975లో విడుదలైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి