
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల ఇంటర్వ్యూలతో వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటారు వేణు స్వామి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాల్యం, విద్యాభ్యాసం, చిత్ర పరిశ్రమలో తొలి అడుగులు, ఆ తర్వాత జ్యోతిష్య, వామాచార రంగాలలోకి ప్రవేశించిన తీరును వివరించారు. మెదక్ జిల్లా గోమారంలో తొమ్మిదో తరగతి వరకు చదివిన ఆయన, చిన్నతనం నుంచే పూజలు చేయడం ప్రారంభించారు. 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన వేణు స్వామి, అన్న రఘునాథ చారి వద్ద ఉంటూనే పౌరోహిత్యాన్ని కొనసాగించారు. హైదరాబాద్కు వచ్చి టెన్త్ , ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీలో ఏబీవీపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, సినిమా ముహూర్తాలు, పూజల ద్వారా చిత్ర పరిశ్రమలో గౌరవం పొందినట్లు తెలిపారు. తన లక్ష్యం కింగ్ అవ్వడం కాదని, కింగ్మేకర్గా ఉండటమేనని మొదటి నుంచీ స్పష్టం చేశారు. తండ్రికి గుడిలో దక్కిన గౌరవం చూసి, జనాల నుంచి గౌరవం పొందాలనే కోరిక చిన్నప్పుడే తనకు కలిగినట్లు తెలిపారు.
2004లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బావమరిది చంద్ర ప్రతాప్ రెడ్డి పరిచయంతో జ్యోతిష్య రంగంలోకి మరింత లోతుగా ప్రవేశించారు. అప్పటికే జ్యోతిష్యం తెలిసినా, దాన్ని వృత్తిగా స్వీకరించి, డెప్త్గా అధ్యయనం చేయడం మొదలుపెట్టారట. సాధారణ పూజలకు భిన్నంగా, త్వరితగతిన ఫలితాలు ఇచ్చే వామాచార మార్గాన్ని అనుసరించడంలో గల కారణాలను వివరించారు. వామాచారం, దశమహావిద్యలు చాలా కఠినమైన సమస్యలకు పరిష్కారాలు చూపుతాయని, సాధారణ జీవితం నుండి సెలబ్రిటీ స్థాయికి, కోటీశ్వరుడిగా మారడానికి సహాయపడతాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్
సినిమా పరిశ్రమలో అప్పటి జనసందోహం ఇప్పుడు లేదని చెబుతూ, దివంగత నటి దివ్యభారతితో కలిసి తన టూవీలర్పై రోడ్లపై తిరిగినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో నటీనటులు టీ తాగడానికి కూడా బయటకు వచ్చే వాతావరణం ఉండేదని తెలిపారు. పరిటాల రవి ఇంట్లో పూజలు చేసిన అనుభవాలను కూడా పంచుకున్నారు, అక్కడ వందమంది గన్మెన్లు, సెక్యూరిటీ ఉండేదని, కుటుంబ వాతావరణం చాలా దగ్గరగా ఉండేదని పేర్కొన్నారు. అలాగే వేణు స్వామి తనను తాను మోటివేషనల్ స్పీకర్గా కాకుండా, జరగబోయే నష్టాలను సూటిగా చెప్పి, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించే వ్యక్తిగా చెప్పుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి