బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్ నివాసంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడు షరీఫుల్ ఇస్లాం ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడం లేదు. అంతేకాదు సీసీటీవీలో లభించిన దృశ్యాలు కూడా షరీఫుల్ ఇస్లాంతో మ్యాచ్ కావడం లేదు.. మరోవైపు సైఫ్పై దాడి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కోల్కతా చేరుకున్నారు. సైఫ్పై దాడి చేసిన షరీఫుల్ ఇస్లాంకు కోల్కతాకు చెందిన జహంగీర్ షేక్ సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. కోల్కతా నివాసి అయిన జహంగీర్ షేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు . వాస్తవానికి సైఫ్ నివాసంలో 19 వేలిముద్రలను ముంబై క్రైంబ్రాంచ్ పోలీసులు సేకరించారు. అయితే వాటిలో ఒక్కటి కూడా షరీఫుల్ ఇస్లాంతో మ్యాచ్ కాలేదు. దీంతో సైఫ్పై దాడి కేసులో మిస్టరీ మరింత ముదిరింది. ఇది ఓ సినిమా థ్రిల్లర్ను తలపిస్తోంది. ముంబై పోలీసుల దర్యాప్తుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. పోలీసులు తప్పుడు వ్యక్తిని అదుపు లోకి తీసుకున్నారని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దాడికి సంబంధించి సైఫ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్కు , ఆయన భార్య కరీనా కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్క పొంతన కుదరడం లేదు. అయితే ఈ కేసుతో తన క్లయింట్కు సంబంధం లేదని అంటున్నాడు షరీఫుల్ ఇస్లాం లాయర్ సందీప్. అనవసరంగా అమాయకుడి అరెస్ట్ చేసి , సైఫ్పై దాడి కేసులో ఇరికించారని ఆరోపిస్తున్నారు. సైఫ్పై దొంగతనం ప్రయత్నంలో దాడి జరిగిందా ? లేక హత్య చేయడానికే కుట్ర జరిగిందా ? అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. దీంతో పోలీసులు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో మరింత ముందుకెళ్లడానికి మరిన్ని వేలిముద్రల నమూనాలను తదుపరి పరీక్ష కోసం పంపారు.
ఇదిలా ఉంటే మహ్మద్ షెరీఫుల్ ఇస్లాం షెహజాద్ బంగ్లాదేశ్ వాసి అని పోలీసులు ఆరోపించారు. అయితే అందుకు కూడా ఎలాంటి ఆధారాలు లేవని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. సైఫ్ ఇంట్లోని సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి, ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖానికి ఎలాంటి పోలికలు లేవని నెటిజన్లు పేర్కొన్నారు. దీంతో ముంబై పోలీసుల పనితీరుపై ఓ ప్రశ్న తలెత్తింది. అసలు నిందితుడు ఎక్కడున్నాడో తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.