
ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉన్న రెండు క్రిమినల్ కేసుల విచారణను రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు దిగువ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది. అలాగే పోలీసులు, ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తి జగ్గన్నగారి శ్రీనివాస్ రావు ఈ పిటిషన్లను విచారించారు. నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసు నంబర్లు 9473/2020, 9469/2020లను కొట్టివేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని వర్మ తరఫు న్యాయవాది రాజగోపల్లవన్ తాయి వాదనలు వినిపించారు.
2018 వివాదమే కేసులకు మూలం
ఈ కేసుల మూలాలు 2018లో విడుదలైన ‘జీఎస్టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్)’ షార్ట్ ఫిల్మ్ వివాదంలో ఉన్నాయి. అమెరికన్ అడల్ట్ ఫిల్మ్ నటి మియా మాల్కోవా ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా చూపించారంటూ పలు మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. వివాదం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో వర్మ పలు టెలివిజన్ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో మహిళా హక్కుల కార్యకర్తలపై వ్యక్తిగత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని, సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ ఫిర్యాదులు నమోదయ్యాయి.
పలు సెక్షన్ల కింద కేసులు
ఈ ఫిర్యాదుల ఆధారంగా 2018లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ దర్యాప్తు నిర్వహించి చార్జిషీట్లు దాఖలు చేసింది. వర్మపై మహిళను లైంగికంగా వేధించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, మహిళ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించిన భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్లు 354ఏ, 504, 506, 509తో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు అయ్యాయి. ఒక కేసులో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ప్రతినిధి, మరో కేసులో ప్రజాతంత్ర మహిళా ఐక్య వేదిక ప్రతినిధి ఫిర్యాదుదారులుగా ఉన్నారు. వర్మ తరఫు వాదనలు విన్న హైకోర్టు.. పోలీసులతో పాటు ఫిర్యాదుదారులకు నోటీసులు జారీ చేసి వారి స్పందన కోరింది. కేసుల తదుపరి విచారణను ఆగస్టు 3, 2026కు వాయిదా వేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.