
‘బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నా’.. తారకరత్న మరణవార్త తెలియగానే బాలయ్య అన్న మొదటి మాట ఇది. అబ్బాయి ప్రాణాన్ని నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశారు బాలయ్య. ఒకవైపు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. మరోవైపు అత్యుత్తమ చికిత్స అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. అయితే ఉదయం నుంచి తారకరత్న పెద్ద కూతురు.. నిషిక తండ్రి భౌతిక కాయం వద్ద నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అయితే బాలయ్య రాగానే వెంటనే వెళ్లి ఆయన్ను కౌగిలించుకున్న తీరు నిజంగా హృదయాన్ని కదిలించింది. ఇన్నాళ్లూ తారకరత్న భార్యబిడ్డలకు ధైర్యాన్ని నూరిపోశారు బాలయ్య. ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు.. వారికి తోడుగా ఉన్నారు. మధ్యలోనే ఏమైనా పనులుండి హైదరాబాద్ వచ్చినా.. ఆ వర్క్స్ ముగిసిన వెంటనే.. బెంగళూరు ఆస్పత్రికి వెళ్లేవారు. అలా కష్ట సమయంలో తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని నూరిపోశారు బాలయ్య. అందుకే బాలయ్య కనిపించగానే వెళ్లి కౌగిలించుకుంది నిషిక. తాత గుండెలపై ఓదార్పును పొందింది.
తెల్లారి లేచింది మొదలు పరస్పర విమర్శలతో విరుచుకుపడే నేతలు ఒక్కటయ్యారు. బద్ధశత్రువులుగా ఉండే చంద్రబాబు, ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరికొకరు పలకరించుకున్నారు. తారకరత్న మృతిపై భేషజాలు మరిచి నివాళులర్పించారు. రాజకీయ వైరుధ్యాన్ని వదిలి బాధాతప్త హృదయాలతో ముచ్చటించుకున్నారు.
తారకరత్న భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయం ఏడు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్లో ఉంచుతారు. తారక్ అకాలమృతిపై ప్రధాని మోదీ, సీఎంలు కేసీఆర్, జగన్ సహా తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..