SP Balu : ఆ పాట పాడేటప్పుడు నరకం చూసాను.. చేతబడి చేశారేమో అనుకున్నా.. ఎస్పీబీ బాలు..

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన గాత్ర సమస్యల గురించి వివరించారు. ఆయనకు వాయిస్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు, మూడు నెలల పాటు గొంతు పూర్తిగా కోల్పోయిన కాలాన్ని "నరకం" చూసినట్లు చెప్పుకొచ్చారు. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఈ సమస్య తీవ్రంగా ఉండేదని, పాడటానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు.

SP Balu : ఆ పాట పాడేటప్పుడు నరకం చూసాను.. చేతబడి చేశారేమో అనుకున్నా.. ఎస్పీబీ బాలు..
Sp Balu

Updated on: Mar 09, 2026 | 7:17 PM

దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా పాటల గురించి చెప్పక్కర్లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్‌లో ఒకానొక దశలో ఎదుర్కొన్న తీవ్రమైన గాత్ర సమస్యలు, వాటి వల్ల కలిగిన మానసిక క్షోభ, కుటుంబసభ్యుల ఆందోళన, చివరకు శస్త్రచికిత్స ద్వారా కోలుకున్న వైనాన్ని పంచుకున్నారు. ఆయన తన గాత్రాన్ని “ప్రపంచానికి చెందింది” అని చాలా మంది అన్నారని పేర్కొన్నారు. అయితే, ఆయనకు వాయిస్ నాడ్యూల్స్ వచ్చినప్పుడు, మూడు నెలల పాటు గొంతు పోగొట్టుకున్న సమయం తనకు “రెండు విధాల నరకం” చూపించిందని వివరించారు. మొదటి నరకం వృత్తిపరమైంది. గీతాంజలి సినిమా మలయాళంలోకి, తెలుగులోకి డబ్ అవుతున్న సమయంలో, ఓ పాప లాలి జన్మకే లాలి పాట రికార్డింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన గొంతు సహకరించలేదట. పాట పాడటం మధ్యలో ఆగిపోవడం, మంచి నీళ్లు తాగి మళ్లీ ప్రయత్నించడం, పదేపదే టేక్‌లు తీసుకోవడం వంటివి జరిగాయి. నాలుగు రోజులు ఇలాగే గడిచింది. విసుగు, కోపం వచ్చి ఏదో విసిరి కొట్టాలంత అయిందని బాలు గుర్తు చేసుకున్నారు. అప్పుడు డాక్టర్‌ను సంప్రదించి, మెడికేషన్, వాయిస్ రెస్ట్ తీసుకున్నారు. నాలుగు రోజులు బానే ఉన్నా, ఐదో రోజు మళ్లీ అదే సమస్య తలెత్తిందని గుర్తుచేసుకున్నారు.

రెండో నరకం ఇంట్లో వాళ్ల ఆందోళన వల్ల కలిగింది. “ఎవరో ఏదో చేసేశారు. ఏదో మందు చేశారు. ఏదో చేతబడి చేశారు. లేకపోతే మా ఆయనకి/అబ్బాయికి ఎందుకు ఇలా అవుతుంది?” అని కుటుంబ సభ్యులు నమ్మారని, ఆయనకు తెలియకుండానే పూజలు, పునస్కారాలు చేశారని తెలిపారు. “ఇది కాదు మొర్రో” అని చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరని, కానీ వాళ్ల నమ్మకాన్ని పోగొట్టడం తనకు ఇష్టం లేదని బాలు చెప్పారు. “మన అసహాయంగా ఉన్నప్పుడు అలా జరిగిందేమో” అని తనకు అనిపించిందని పేర్కొన్నారు.

ఈ నాలుగు నెలల్లో ప్రతిరోజూ ఫోన్లు మోగుతూనే ఉన్నాయని, రికార్డింగ్‌ల కోసం కాల్స్ వచ్చేవని, కానీ తాను పాడలేకపోయానని బాలు చెప్పారు. “నా గాత్రానికి ఏదో ప్రాబ్లం అయింది. సింగర్స్ నాడ్యూల్ వచ్చింది. డాక్టర్ అయితే సర్జరీ చేయమంటున్నారు. సర్జరీ చేసుకుంటే కొంతమంది వాయిస్ పోయే అవకాశం ఉంటుంది అంటున్నారు. అందుకని మెడికేషన్ చేయాలంటే ఎన్నాళ్లు పడుతుందో తెలీదు. దయచేసి మీరు నా కోసం ఆగద్దు. మీరు ఎవరిచేతనైనా పాడించండి” అని నిర్మాతలకు చెప్పేవారట. కొందరు ఆయన కోసం ఎదురు చూశారని, మరికొందరు వేరే వారిని పెట్టి పాడించుకున్నారని ఆయన గుర్తు చేసుకున్నారు.

అదే సమయంలో, దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఫోన్ చేసి, “బాలు ఇలా విన్నాను నేను, ఏమైంది నీ గొంతుకి?” అని అడిగారని, “ఆపరేషన్ చేసుకుంటున్నావా?” అని ప్రశ్నించారని బాలు తెలిపారు. తాను ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పగా, “దయచేసి చేసుకోవద్దు నాన్న. ఏదైనా చిన్న టిష్యూ పోయినా కూడా నీ గొంతు పోతుందిరా” అని ఆమె సలహా ఇచ్చారని చెప్పారు. అయితే, బాలు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం, మైకం నుండి బయటపడగానే, డాక్టర్లు “తొందరపడకండి, రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకోవాలి” అన్నప్పటికీ, ఆయన వెంటనే పాడటం మొదలుపెట్టారని, అది తనకు ఎంతో సౌకర్యంగా అనిపించిందని బాలు వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Follow Us