
డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసి తిరుగులేని దర్శకుడిగా పేరుపొందారు. అయితే, ప్రస్తుతం పూరి హవా కొంత తగ్గిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ నేపథ్యంలో, తన తొలి బ్లాక్బస్టర్లలో ఒకటైన ఇడియట్ సినిమా వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన కథను ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇడియట్ సినిమా షూటింగ్ పూర్తయి, సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. దీంతో ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు ప్రివ్యూ షో వేశారు. సినిమా చూసిన వారందరూ బాగుందని చెప్పినప్పటికీ, వారి కళ్ళల్లో నిజాయితీగా ఆ సమాధానం వస్తున్నట్టు అనిపించలేదని మార్తాండ్ కే వెంకటేష్ గుర్తుచేసుకున్నారు. ప్రేక్షకులు డల్గా ఆన్సర్ ఇస్తుండటంతో, పూరి జగన్నాథ్ లోలోపల ఏదో లోపం ఉందని గ్రహించారు.
కొంతమందిని అడిగినప్పుడు, సినిమా మొత్తం ఒకే ధోరణిలో చాలా లౌడ్గా వెళుతుందని, ఎక్కడా ఆడియన్స్కు బ్రీథింగ్ స్పేస్ లేదని అభిప్రాయపడ్డారు. రవితేజ వాయిస్ కూడా ఒక కారణమని భావించారు. మరికొంతమంది సినిమా ఫ్లాప్ అవుతుంది అని కూడా చెప్పారట. ఈ అభిప్రాయాన్ని మార్తాండ్ కే వెంకటేష్తో సహా పలువురు పూరికి చెప్పారట. ఈ సమస్యపై పూరి జగన్నాథ్, మార్తాండ్ కే వెంకటేష్ను, తన కో-డైరెక్టర్ను పిలిచి చర్చించారట. ప్రేక్షకులు నిరాశగా ఉండటానికి గల కారణం తెలిసిన తర్వాత, ఒక వినూత్నమైన ఆలోచనను పూరి ముందుకు తెచ్చారు. “మనం మణిరత్నం స్టైల్లో ఫాలో అవుదామా.?” అని ఆయన అడిగారు. మణిరత్నం సినిమాల్లో కథకు సంబంధం లేకుండా, ప్రేక్షకులకు కాసేపు వినోదం పంచడానికి కామెడీ సీన్లను పెట్టే స్ట్రాటజీ గురించి పూరి వివరించారు. “సినిమాని మధ్యలో అక్కడక్కడ బ్రేక్ చేసి సంబంధం లేకుండా కొన్ని కామెడీ సీన్లు పెడదాం.. దీనివల్ల జనాలు కాసేపు నవ్వుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ కథలోకి వెళ్తారు” అని పూరి చెప్పారట..
అప్పటికే సినిమా సెన్సార్ పూర్తయి, ప్రివ్యూ షోలు కూడా పడ్డాయి. అయినా సరే, పూరి జగన్నాథ్ తన నిర్ణయానికి కట్టుబడి, కామెడీయన్ ఆలీతో కొన్ని కొత్త సన్నివేశాలను షూట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా షూట్ చేసిన వాటిలో “ఇసుక కామెడీ సీన్” ఒకటి. ఈ సీన్ అద్భుతంగా వర్కౌట్ అయ్యిందని మార్తాండ్ కే వెంకటేష్ పేర్కొన్నారు. ఈ కామెడీ ట్రాక్ సినిమాకు చాలా అవసరమైన బ్రేక్ అందించడమే కాకుండా, ప్రేక్షకులను అలరించి, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇడియట్ సినిమా విజయంతో ఈ ఫార్ములా ఎంత ప్రభావవంతంగా ఉంటుందో పూరి జగన్నాథ్కు అర్థమైంది. అందుకే, ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు వంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో కూడా ఇదే స్ట్రాటజీని ఉపయోగించారు.
ప్రశ్నలు & సమాదానాలు
ప్రశ్న : పూరిజగన్నాథ్ లేటెస్ట్ సినిమా పేరు ఏంటి.?
జవాబు : స్లామ్ డాగ్ : 33 టెంపుల్ రోడ్
ప్రశ్న: పూరిజగన్నాథ్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఎవరు.?
జవాబు : సంయుక్త మీనన్, కీలక పాత్రలో టబు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి