
తెలుగు చిత్రపరిశ్రమలో రెబల్ స్టార్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో కృష్ణంరాజు (Krishnam Raju). ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన గచ్చిబౌలీలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసారు. తమ అభిమాన హీరో అకాల మరణంతో సినీప్రముఖులు, అభిమానులు శోకసంధ్రంలో మునిగిపోయారు. రెబల్ స్టార్ ఇక లేరు అనే వార్తను టాలీవుడ్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. హీరోగా.. విలక్షణ నటుడిగా… ప్రతినాయకుడిగా మెప్పించిన కృష్ణం రాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. అయితే కృష్ణం రాజు వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
కృష్ణంరాజుకు శ్యామలదేవి కంటే ముందే సీతదేవితో వివాహం జరిగింది. కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహా వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తే సీతాదేవిని కృష్ణంరాజు 1969లో వివాహం చేసుకున్నారు. అయితే 1995లో ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కొన్నాళ్లపాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండోపెళ్లి ఒత్తిడి తీసుకువచ్చి.. 1996లో తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండవ పెళ్లి చేశారు. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీళ్లు మాత్రమే కాకుండా మొదటి భార్య సీతాదేవి కుమార్తె కూడా కృష్ణంరాజు వద్దే ఉంటుంది. అలాగే మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు.. శ్యామలాదేవి దంపతులు ఐదుగురు ఆడపిల్లలకు తల్లిదండ్రులుగా ఉంటున్నారు.