
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి (34) కన్నుమూశారు. గుండె పోటుతో అతి చిన్న వయసులోనే ఆయన మరణించారు. స్నేహితుడి పెళ్లి వేడుకకు హాజరైన రాకేష్.. మెహిందీ ఫంక్షన్లో ఉన్నట్లుండి గుండె పోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉడిపి జిల్లాలో జరిగిన మెహందీ వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది. మెహందీ వేడకలో దిగిన ఫొటోలను ఇన్స్టా ఖాతాలో కూడా పోస్టు చేశారు. అనంతరం సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇది జరిగిన కాసేపటికే రాకేష్ కన్నుమూశారు. దీంతో చివరి సారిగా పెట్టిన రెండు ఇన్స్టా పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మియార్లోని తన స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకకు వెళ్లిన రాకేష్ అక్కడ తన స్నేహితులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యులు చనిపోయినట్లు ధ్రువీకరించారు. మరణానికి కారణం గుండెపోటుగా అనుమానిస్తున్నారు. కార్కల టౌన్ పోలీస్ స్టేషన్లో అసహజ మరణం కింద కేసు నమోదైంది.
Always with a pure sweet hearted smile , ever loving , and extremely talented artist , you will always remain in our heart , deeply saddened , Rakesh we miss you! pic.twitter.com/Qx9Tx0bOOT
— Pruthvi Ambaar (@AmbarPruthvi) May 12, 2025
కాగా.. కన్నడలో ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్ 3 విన్నర్గా రాకేశ్ నిలవడం విశేషం. 2014లో కడలే బాజిల్ అనే తుళు రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత రాకేష్కు మంచి పేరు వచ్చింది. రాకేష్ అమ్మేర్ పోలీస్, ఉమిల్ వంటి కొన్ని కన్నడ, తుళు చిత్రాలలో కూడా నటించారు. రాకేష్ కర్ణాటకకు చెందిన వివిధ రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. రాకేశ్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్గా వస్తోన్న కాంతారా చాప్టర్ 2లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న చిత్ర బృందం.. మువీని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఈ మువీ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ మృతి పట్ల పలువురు సినీ సెబల్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.