Jeevitha: జియో ఆఫర్‌ పేరుతో జీవితను బురిడీ కొట్టించే యత్నం.. పాపం మేనేజర్‌ బలైపోయాడుగా..

|

Nov 23, 2022 | 12:18 PM

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. జియో ఆఫర్‌ పేరుతో ఓ మోసగాడు ఆమె మేనేజర్‌ను బురిడీ కొట్టించాడు. వివరాల్లోకి వెళితే.. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

Jeevitha: జియో ఆఫర్‌ పేరుతో జీవితను బురిడీ కొట్టించే యత్నం.. పాపం మేనేజర్‌ బలైపోయాడుగా..
Jeevitha Rajasekhar
Follow us on

ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ విక్రయాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పండగ సమయాల్లో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుండడంతో చాలామంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కే మొగ్గుచూపుతున్నారు. అయితే కొందరు సైబర్‌ నేరగాళ్లు దీనినే అవకాశంగా మల్చుకుంటున్నారు. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో సామాన్యులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. విచిత్రమేమిటంటే సైబర్‌ మోసగాళ్లు చేతిలో సెలబ్రిటీలు కూడా మోసపోతుండడం. ఇటీవల ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగుచూశాయి. ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు జీవితా రాజశేఖర్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. జియో ఆఫర్‌ పేరుతో ఓ మోసగాడు ఆమె మేనేజర్‌ను బురిడీ కొట్టించాడు. వివరాల్లోకి వెళితే.. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఫారూఖ్‌ అంటూ పరిచయం చేసుకున్న అతను మీకు ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇచ్చింది నేనే అని మాటలు మొదలుపెట్టాడు. అయితే ఆ సమయంలో జీవిత బిజీగా ఉండడంతో తన మేనేజర్‌తో మాట్లాడమని చెప్పింది. దీంతో అతనితో మాట్లాడిన ఆ కేటుగాడు తనకు ప్రమోషన్‌ వచ్చిందని .. ప్రస్తుతం జియోలో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై బంపర్ ఆఫర్ ఉందని.. తాను రిఫర్ చేసి మీకు 50 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానని నమ్మించాడు.

ఈ ఆఫర్ కొద్ది కాలమే ఉంటుందంటూ.. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్‌ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. రూ.2.5 లక్షల ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కేవలం రూ.1.25 లక్షలకే వస్తుందని చెప్పాడు. దీంతో ఫారూక్ చెప్పిన మాటలు నిజమనుకుని నమ్మిన జీవిత మేనేజర్ రూ.1.25 లక్షల రూపాయలను మోసగాడి అకౌంట్ లోకి ఆన్ లైన్ ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆ తర్వాత షరా మామూలే.. అతనికి ఫోన్ చేస్తే ఎటువంటి స్పందన రాలేదు. కొద్ది రోజుల తర్వాత ఫోన్ స్విఛ్చాప్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లుగా గ్రహించిన జీవిత మేనేజర్‌ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు అతని ఫోన్, ఆన్ లైన్ అకౌంట్ ఆధారంగా దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబు అని తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా నాగేంద్ర పలు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేసుకొని పలు మోసాలకు పాల్పపడ్డారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా యువ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని తెలుస్తోంది. నగరంతో పాటు సైబరాబాద్‌లోనూ ఇతనిపై కేసులు నమోదు కావడంతో గతంలో కొన్ని రోజుల పాటు జైలు ఊచలు కూడా లెక్కించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్నిసినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..