
ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ను మలుపు తిప్పిన సినిమా మురారి, మహేష్ కెరీర్ మొట్టమొదటి బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఫ్యామిలీ ప్రేక్షకులను మహేష్ బాబును దగ్గర చేసిన మురారి చిత్రం విడుదలై ఈరోజుకు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. దర్శకుడు కృష్ణవంశీ స్క్రీన్ ప్లే, మహేష్ బాబు నటన, అద్భుతమైన కథ కలిసి మురారిని ఒక క్లాసిక్గా నిలిపాయి. ఈ చిత్ర నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, ఆసక్తికర విషయాలను సినీ విశ్లేషకులు చిలకగట్టి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఆయన మాట్లాడుతూ.. కృష్ణవంశీ మొదట మహేష్ బాబుతో ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని అనుకున్నారు. అయితే, అంతఃపురం సినిమా పూర్తయిన తర్వాత పాపికొండల్లో స్నేహితులతో సరదాగా గడుపుతున్న సమయంలో, ఇందిరా గాంధీ కుటుంబంలో జరిగిన ఆకస్మిక మరణాల గురించి చర్చ జరిగిందట. అక్కడ ఒక ఆయుర్వేద వైద్యుడు శాపం కారణం అయి ఉండొచ్చని చెప్పడంతో కృష్ణవంశీ ఆలోచనలో పడ్డారు. ఇదే సమయంలో, ఒక ప్రముఖ వ్యక్తి తన ఇంటి పాలేరు భార్య శాపనార్థాలు పెట్టిన తర్వాత వారి కుటుంబంలో వరుస ఆకస్మిక మరణాలు సంభవించిన విషయాన్ని తెలిపారట. ఈ సంఘటనల స్ఫూర్తితోనే శాపం నేపథ్యంలోని మురారి కథను సిద్ధం చేసుకున్నారు కృష్ణవంశీ.
నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు, కృష్ణ మొదట వినిన రొమాంటిక్ కథను వదిలి, ఈ కొత్త కథను చెప్పినప్పుడు కృష్ణవంశీని సందేహించారట. మహేష్తో చర్చించుకొని నిర్ణయం తీసుకోమని కృష్ణ చెప్పారంట. కృష్ణవంశీ మాత్రం ఈ సినిమా 20-30 ఏళ్ల పాటు మాట్లాడుకుంటారని, ఒక రొమాంటిక్ కథ అయితే వచ్చి, వెళ్లిపోతుందని గట్టిగా నమ్మారు. మహేష్ బాబు దర్శకుడి విజన్ను పూర్తిగా నమ్మరు. అంతే కాదు మురారి నిర్మాణంలో పలు రాజీలు చోటు చేసుకున్నాయి. బామ్మ పాత్ర కోసం షావుకారు జానకిని అనుకున్నా, డేట్స్ సమస్యతో సుకుమారిని ఎంపిక చేశారు. మొదటి హీరోయిన్గా ఇషా డియోల్ను సంప్రదించగా, ఆమె పారితోషికం గురించి ముందుగానే చర్చించడంతో, సోనాలి బెంద్రేను తీసుకున్నారు.ఇషా డియోల్ ను సంప్రదించినప్పుడు ఆమె తల్లి ముందు రెమ్యునరేషన్ ఎంతో చెప్పండి అనడంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఆమెను హీరోయిన్ గా తీసుకుంటే రెమ్యునరేషన్ తో పాటు ఇతర ఖర్చులు కూడదా ఎక్కువైపోతాయని భావించి మరో హీరోయిన్ కోసం వెతికారట. అదే సమయంలో ఫ్రెండ్ పెళ్లి కోసం హైదరాబాద్ కు వచ్చిన సోనాలి బెంద్రేకు కథ చెప్పడంతో ఆమె వెంటనే ఓకే చేసిందట.
అలాగే, హీరో, హీరోయిన్ ఇళ్ల కోసం కేరళలో షూటింగ్ చేయాలనుకున్నా, బడ్జెట్ సమస్యలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని హౌస్ సెట్స్కు మార్చారు. పాత దేవాలయం సన్నివేశాల కోసం కర్ణాటకలోని బాదామి ఆలయాన్ని అనుకున్నా, బడ్జెట్ దృష్ట్యా శంషాబాద్ గుడికి షిఫ్ట్ చేశారు. క్లైమాక్స్ సన్నివేశంలో పండితుల పాత్ర కోసం గుంటూరులోని మారి సేవాశ్రమంలో స్థిరపడిన ధూళిపాల సీతారామశాస్త్రిని ఒప్పించి తీసుకొచ్చారట. చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు అంకితభావం అద్భుతం. 104 డిగ్రీల జ్వరంతో కూడా డుం డుం నటరాజు పాట, వాటర్ ఫైట్ సన్నివేశాలను పూర్తి చేశారు. మూడు గంటల పది నిమిషాల నిడివి ఉన్న సినిమాను తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరగా, కృష్ణవంశీ అంగీకరించలేదు. మొదటి రెండు మూడు రోజులు ఫ్లాప్ టాక్ వస్తుందని, కానీ సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుందని ఆయన నమ్మకం పెట్టుకున్నారు. చివరికి ఆయన నమ్మకమే నిజమైంది. ఈ సినిమా 175 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై, మహేష్ బాబు కెరీర్లో మొదటి 175 రోజుల చిత్రంగా నిలిచింది. మురారి ఒక కల్ట్ క్లాసిక్గా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి