
తెలుగు సినిమా పరిశ్రమలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్గా తనదైన శైలితో ప్రేక్షకులను మెప్పించిన నటించిన వారిలో లతాశ్రీ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే తెలుగు సినిమాలోకి అడుగుపెట్టిన లతాశ్రీ, తన ప్రతిభతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా చెల్లెలి పాత్రలలో జీవించి, యమలీల, నెంబర్ వన్, జంబలకిడి పంబ వంటి సినిమాలతో ఆమె ఒక వెలుగు వెలిగారు. ఇక రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటీ అడక్కు చిత్రంలో తన అన్నయ్యను పాలవాడితో జెండా ఎత్తేస్తా అంటూ బెదిరిస్తూ, పెళ్లి చేయమని అడిగే పాత్రలో ఆమె నటన విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాత్ర ఆమె కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లోనూ ఆమె నటించారు. దాదాపు వందకు పైగా చిత్రాలలో నటించి, తెలుగులో తిరుగులేని నటిగా నిలిచారు. ఇండస్ట్రీలో మంచి బిజీగా ఉన్న సమయంలోనే లతాశ్రీ అకస్మాత్తుగా సినీ రంగానికి దూరం అయ్యారు. దీనికి గల కారణాలను ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటిగా తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తనకంటూ ఒక సొంత జీవితాన్ని, కుటుంబాన్ని మిస్ అవుతున్నానని ఆమె భావించారు. దాంతో పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు.
పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహం ఉన్నప్పటికీ, తన పిల్లలను, కుటుంబాన్ని చూసుకోవడం కోసమే అనేక సినిమా అవకాశాలను వదులుకున్నానని ఆమె తెలిపారు. దీనికి తోడు, లతాశ్రీ జీవితంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఆమె తల్లి మరణం ఆమెను తీవ్రంగా కృంగదీసింది. సినీ రంగంలో ఎదగడానికి తన తల్లి ఎంతో సహాయపడిందని, ఆమె దూరం అవ్వడం తీరని లోటని లతాశ్రీ పేర్కొన్నారు. ఈ కారణాలన్నింటితో ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. లతాశ్రీకి మళ్లీ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన బెండప్పారావు సినిమాలో అల్లరి నరేష్ చెల్లెలి పాత్రలో నటించే అవకాశం వచ్చింది. తన కెరీర్కు ఎంతో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు కావడంతో, ఆయన మాట కాదనలేక ఆమె ఆ సినిమాలో నటించారు. ఆ తర్వాత కూడా వరుస ఆఫర్లు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించి, మళ్లీ కుటుంబానికే పరిమితమయ్యారు.
ఇంతకీ లతాశ్రీ మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.? అతను ఎవరో కాదు యంగ్ స్టార్ హీరో నాగశౌర్య. హీరో నాగశౌర్య లతాశ్రీకి అన్నయ్య కొడుకు. క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. అయితే, ఆ సినిమా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఆ తర్వాత చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, జో అచ్యుతానంద వంటి చిత్రాలు నాగశౌర్యకు హీరోగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. 2017లో వచ్చిన ఛలో సినిమాతో ఆయన హీరోగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా మారారు. ఏమాత్రం సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చినవారు తమ నేపథ్యం గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ, నాగశౌర్య తన అత్త లతాశ్రీ ఒక స్టార్ ఆర్టిస్ట్ అని ఎక్కడా ప్రస్తావించలేదు. తన స్వయంకృషి, ప్రతిభతో మెట్టుమెట్టుగా ఎదిగి, సొంత కాళ్లపై నిలబడి స్టార్ హీరోగా మారారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి