
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా వెలుగొందుతున్నారు. ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతే కాదు ఈ మధ్య ఇద్దరూ వరుస హిట్స్ తో జోరుమీదున్నారు. బయట వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ, సినిమా పోటీ విషయానికి వస్తే అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధమే నడుస్తుంది. గత ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తలపడి ఇద్దరూ విజయం సాధించారు. సినిమాల పరంగా ఈ ఇద్దరి మధ్య పోటీ ఉంటుంది కానీ వ్యక్తిగతంగా ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు.
పరిశ్రమలోని ఇతర హీరోల మాదిరిగానే చిరంజీవికి కూడా బాలకృష్ణ సినిమాలు అంటే బాగా ఇష్టం. అందులోనూ బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య నటించి సంచలన విజయాన్ని సాధించిన సమరసింహారెడ్డి సినిమా అంటే చిరుకి చాలా ప్రత్యేకం. అనేక సందర్భాల్లో చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మొన్నామధ్య కూడా ఓ సందర్భంగా సమరసింహారెడ్డి సినిమా చూసిన తర్వాతే తనకు కూడా ఫ్యాక్షన్ సినిమాలు చేయాలని అనిపించిందని తెలిపారు.ఇక సమరసింహారెడ్డి సినిమాను తాను చాలాసార్లు చూశానని, తెలుగు సినిమాల్లో హీరోలు తొడకొట్టడం ఈ చిత్రంతోనే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు.
సమరసింహారెడ్డి పాత రికార్డులను బద్దలుకొట్టి అనేక కొత్త రికార్డులను సృష్టించింది. దీని తర్వాతే తెలుగులో ఫ్యాక్షన్ కథాంశంతో పలు సినిమాలు కూడా వచ్చాయి. సమయం బాగాలేనప్పుడు, మనసు కుదురుగా లేనప్పుడు, లేదా బోర్ కొట్టినప్పుడు ఎక్కువగా సమరసింహారెడ్డి సినిమానే చూస్తుంటానని చిరంజీవి చెప్పారు. ఇది బాలయ్య సినిమా కెరీర్కు ఒక మలుపుతిప్పిన చిత్రంగా నిలిచింది. ఆ రోజుల్లోనే సుమారు 17 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, అత్యధిక రోజులు ప్రదర్శితమైన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, కాకా సినిమాల్లోలో నటిస్తుండగా, బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.