
తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వారిలో సముద్ర ఒకరు. సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలు దర్శకత్వం వహించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సముద్ర సినిమాలు తగ్గించారు. తన కెరీర్ ఆరంభం, పెద్ద హీరోలతో పనిచేసే అవకాశాలపై పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సముద్ర. ఆయన దర్శకత్వం వహించిన సింహరాశి చిత్రాన్ని మొదట మరో హీరోను అనుకున్నారట. ఆ హీరోకి కథ కూడా చెప్పగా ఆయనకు బాగా నచినప్పటికీ ఆ సినిమా మరో హీరోతో చేయాల్సి వచ్చిందట. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆ హీరో ఎవరో కాదు..
సూపర్ స్టార్ మహేష్ బాబు.. సింహరాశి సినిమాను ముందుగా చేయాలని అనుకున్నట్లు సముద్ర తెలిపారు.. మహేష్ బాబు రాజకుమారుడు సినిమా సమయంలో, అప్పటికి ఆయన హీరోగా మారి మూడవ రోజు, ప్రకాష్ రాజ్ ద్వారా సముద్రకు మహేష్ను కలిసే అవకాశం లభించింది. సముద్ర చెప్పిన సింహరాశి కథాంశం మహేష్ బాబుకు బాగా నచ్చింది. సినిమా చేయడానికి మహేష్ ఆసక్తి చూపించారు. అయితే, ఈ కథకు భారీ బడ్జెట్ అవసరం కావడంతో నిర్మాత ఆర్.బి.చౌదరి ఈ ప్రాజెక్ట్ను వాయిదా వేయాలని, దానికి బదులుగా రీమేక్లు చేయాలని సూచించారు. మహేష్ బాబు రీమేక్లకు ఆసక్తి చూపకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది. అదే సమయంలో, మాయి అనే తమిళ చిత్రం విడుదలవగా, దానిని తెలుగులో రీమేక్ చేయాలని చౌదరి గారు భావించారు. అయితే, మాయి సినిమానే యువరాజు చిత్రమని ఆయన అన్నారు.
సింహరాశి మదర్ సెంటిమెంట్తో కూడిన సినిమా తెలుగులో పెద్ద హిట్ అవుతుందని సముద్ర గట్టిగా నమ్మారు. ఆ తర్వాత సింహరాశి ప్రాజెక్టు రాజశేఖర్ గారి వద్దకు వెళ్ళింది. బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే, ఆర్.బి.చౌదరి గారు రాజశేఖర్ను సంప్రదించి, సముద్ర ప్రతిభ గురించి చెప్పారట. రాజశేఖర్ సముద్ర షార్ప్నెస్ను మెచ్చుకొని, ఆయనకే అవకాశమివ్వాలని కోరడంతో, సింహరాశి చిత్రం రాజశేఖర్ హీరోగా తెరకెక్కింది. మహేష్ బాబుతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ..
రాజకుమారుడు నుండి అతిథి వరకు సుమారు ఏడు సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణించానని సముద్ర తెలిపారు. ఒక దశలో తాను వరుసగా ఏడు విజయవంతమైన చిత్రాలు తీశానని, డార్లింగ్ డార్లింగ్ ఒక్కటే ఫ్లాప్ అని పేర్కొన్నారు. అయితే, ఫ్లాపులు వచ్చిన తర్వాత పెద్ద హీరోలను కలవడం సరికాదని, విజయం ఉన్నప్పుడే వారిని సంప్రదించాలని భావించి మహేష్ బాబును కలవడం తగ్గించేశానని సముద్ర చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారి నుండి కూడా సముద్రకు ప్రోత్సాహం లభించింది. హిట్లర్ సమయంలో చిరంజీవి గారు సబ్జెక్ట్ సిద్ధం చేసుకోమని చెప్పినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. చెన్నై, హైదరాబాద్ మధ్య తిరుగుతూ చిరంజీవి గారి షూటింగ్ లొకేషన్లలో ఆయనను కలిసేవాడినని, చిరంజీవి తనకు తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పి, ముందుగా మరికొన్ని చిత్రాలపై పనిచేయమని సలహా ఇచ్చారని తెలిపారు. శివరామరాజు స్క్రిప్ట్ను నాగబాబు ద్వారా చిరంజీవి గారికి వినిపించే ప్రయత్నం చేశానని, అయితే చిరంజీవి ఒరిజినల్ సినిమా చూసి మార్పులను అర్థం చేసుకోకపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్ మిస్ అయిందని సముద్ర అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.