
బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘బేబీ’ జోడీ, ’90s’ దర్శకుడి కలయికలో సితార నిర్మించిన సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువతలో తారస్థాయి అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం, సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. “అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ సమయంలో మేము అమెరికా వెళ్లాం. అప్పుడు అక్కడ ఆనంద్ ఐటీ జాబ్ చేస్తున్నాడు. ఆ సమయంలో కలిసినప్పుడు సినిమాల గురించి మాతో మాట్లాడేవాడు. చూస్తే ఐటీ జాబ్ చేస్తున్నాడు, కానీ మాకు ఉన్నంత సినిమా పిచ్చి ఉందేంటని అప్పుడే అనుకున్నాను. కట్ చేస్తే దొరసాని సినిమాతో హీరో అయిపోయాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, బేబీ సినిమాలు చేశాడు. ఆనంద్ ఏ పాత్ర చేసినా, ఆ పాత్రలో సహజంగా ఒదిగిపోతాడు. అలాగే వైష్ణవి కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇక్కడివరకు వచ్చారు. 90s సిరీస్ లో మొదట సుప్పిని సుద్దపూసని చూసి నవ్వుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో పిల్లలు చూస్తుంటే, వాళ్ళతో కలిసి సిరీస్ చూశాను. ఆదిత్య గొప్పగా రాశాడు. ఒక కొత్త రచయిత రాశాడనే ఫీలింగ్ కలగలేదు. అనుభవమున్న రచయిత రాశాడు అనిపించింది. ఇప్పుడు ఎపిక్ కూడా టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. సెప్టెంబర్ 11న విడుదలవుతున్న ఎపిక్ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.