వారికి కోరికలు చాలా తక్కువ..! అందుకే వాళ్లు అలా ఉన్నారు.. మనం ఇలా ఉన్నాం: పూరిజగన్నాథ్
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్దాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక తాజాగా పూరి మ్యూజింగ్స్లో భాగంగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యూత్ లో పూరికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సినిమాలతోనే కాదు పూరి తన “పూరి మ్యూజింగ్స్”లో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటారు. అనేక సామజిక అంశాల పైన పూరి చెప్పే మాటలను ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా ఆధునిక సమాజాల కంటే ఆదివాసీ సంస్కృతుల గొప్పతనాన్ని పూరిజగన్నాథ్ తెలిపారు. ఆదివాసీలకు మనకున్న తెలివితేటలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవచ్చు, అయినప్పటికీ వారు మనకంటే ఎంతో మంచిగా జీవించారు. ఇది వారి సంబంధాల లోతు, జ్ఞాన వ్యవస్థలు, జీవన విధానం వల్ల సాధ్యమైంది. వారికి ప్రకృతితో బలమైన అనుబంధం ఉంది. అడవులు, జంతువులు, రుతువులను వారు లోతుగా అర్థం చేసుకున్నారు. వారి జీవనశైలి సుస్థిరమైనది, పర్యావరణానికి హాని చేయనిది. మనం, మన జాతి, మన తండా అనే సామూహిక భావన వారిలో బలంగా ఉంది, అయితే ఆధునిక సమాజంలో నేను అనే వ్యక్తివాదం ఎక్కువై మనుషుల మధ్య దూరాన్ని, ఏకాంతాన్ని పెంచుతోందని పూరి తెలిపారు.
ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా
ఆదివాసీలు అపారమైన జ్ఞాన సంపదను కలిగి ఉన్నారు. అడవిలో లభించే ఆకులు, ఆయుర్వేదం, వ్యవసాయ పద్ధతులు, మనుగడ నైపుణ్యాలపై వారికి గొప్ప పట్టు ఉంది. ఈ జ్ఞానం తరతరాలుగా వారికి సంక్రమిస్తుంది. పండగలు, పాటలు, నృత్యాలు వారి దైనందిన జీవితంలో అంతర్భాగం. వారు తమ సంస్కృతిలో నిజంగా జీవిస్తారు, అయితే మనం మన సంస్కృతి గురించి కేవలం మాట్లాడుకుంటాం లేదా గుర్తుతెచ్చుకుంటాం అంతే.. వారికి కోరికలు చాలా తక్కువ, అందుకే వారు మనకంటే ఆనందంగా జీవిస్తారు. బతకడానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు తీరితే చాలు వారికి, అదే వారికి ఆనందం. ఆధునిక సమాజంలో మనం ఎక్కువ సంపాదించాలని, ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తాం. కానీ ఒక ఆదివాసీ సమూహం మరొక సమూహాన్ని డామినేట్ చేయాలని ఎప్పుడూ చూడదు. వారు పోటీపడకుండా, కలిసిమెలిసి ఉంటారు. వారిలో ఎవరికి హాని జరిగినా, అందరూ కలిసి నిలబడతారు, ఒక మాట మీద ఉంటారు.
ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!
ఆదివాసీలు అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. మనలా అనవసరంగా రోజంతా మాట్లాడరు. వారికి ఆధునిక ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు లేకపోయినా, ప్రకృతిని, ఆకులను నమ్ముకొని మనకంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆధునిక విద్య లేకపోవడం వారికి ఒక రకంగా ప్రయోజనకరంగా మారింది, ఎందుకంటే వారికి నేరపూరిత ఆలోచనలు రావు, ఒకరినొకరు మోసం చేసుకోరు. ఆదివాసీ సంస్కృతులు సంబంధాలు, అంతర్గత శ్రేయస్సు విషయంలో అత్యంత గొప్పవి. ఆదివాసీ గ్రామాలలో ఎక్కడా చెత్త పడి ఉండదు. వారికున్న పరిశుభ్రత, ఆరోగ్యం మనలో లేదు. ప్రకృతిని ప్రేమించడంలో వారు మనకంటే ముందున్నారు. మనం అడవులను నరికి పాడు చేస్తుంటే, వారు అడవి తల్లి నీడలో నిద్రిస్తారు. ఆధునిక సమాజం వారిని అనాగరికులుగా చూస్తుంది, కానీ నిజమైన నాగరికత లోపించింది మనకే. ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో 500 మిలియన్ల మందికి పైగా ఆదివాసీలు జీవిస్తున్నారు. వారికి ప్రత్యేకమైన భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి ఆదివాసీ సంస్కృతిలో ఆడవారికి ఎంతో గౌరవం ఉంటుంది. ఆడవారిని అబ్యూజ్ చేయడం, మానభంగం చేయడం మన నాగరిక సమాజంలోనే ఎక్కువ.
ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
అమెజాన్, బ్రెజిల్, పెరూ, కెన్యా, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, పపువా న్యూగినియా వంటి అనేక దేశాలలో ఇప్పటికీ ఆదివాసీలున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5,000 స్థానిక సమూహాలు ఉన్నాయి. నాగరికత, విద్య పెరిగిపోయిన మనమే నాశనమైపోయాం. వారు ఇప్పటికీ మనకంటే గొప్పగా, మనశ్శాంతితో జీవిస్తున్నారు. ఆదివాసీలను అన్సివిలైజ్డ్ అని భావిస్తే, అది మన నాగరికత లోపాన్ని సూచిస్తుంది. నేటివ్ అమెరికాలో ఒక సామెత ఉంది: “మేము ఈ భూమిని మా పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మా పిల్లల దగ్గర నుండి అప్పుగా తీసుకున్నాం.” ఆదివాసీలు ఎవరో కాదు, ఒకప్పటి మనమే. పూరి జగన్నాథ్ చివరిగా “అవర్ రూట్స్ ఆర్ డీపర్ దెన్ దిస్ స్టుపిడ్ రోడ్స్” అని ముగించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
