
ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు బి. గోపాల్, నందమూరి బాలకృష్ణతో కలిసి ఐదు చిత్రాలకు పనిచేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన బాలకృష్ణ నటన, బాలయ్య డెడికేషన్, అలాగే ఆయన వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బాలకృష్ణకు కోపం ఎక్కువని బయట ప్రచారం ఉన్నప్పటికీ, తాను పనిచేసినన్ని రోజులు అలాంటి అనుభవం ఎదురవ్వలేదని గోపాల్ తెలిపారు. రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ సమయంలో బాలకృష్ణ చూపిన అంకితభావం బి. గోపాల్ను ఎంతగానో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం బాలకృష్ణ తన గెస్ట్ హౌస్ నుంచి పోలీస్ జీప్లో లాఠీ పట్టుకుని రావాలని డిమాండ్ చేశారు. క్యారెక్టర్ స్వభావాన్ని పూర్తిగా ఓన్ చేసుకునేందుకు, ఒక నిజమైన సీఐ ఎలా అయితే జీపులో కాలు బయటపెట్టి, లాఠీ పట్టుకుని వస్తారో, బాలయ్య కూడా సరిగ్గా అలాగే లొకేషన్కు వచ్చేవారట. ఈ సంఘటన బాలకృష్ణ పాత్రలో లీనమయ్యే తీరుకు నిదర్శనమని గోపాల్ పేర్కొన్నారు. రౌడీ ఇన్స్పెక్టర్లోని ఒక సీన్లో, బాలకృష్ణ కుర్చీని తన్ని “ఈ డ్రెస్ వేసినంతవరకేరా నేను పోలీస్ ఆఫీసర్ ని. ఈ డ్రెస్ తీస్తే నీకంటే పెద్ద రౌడీనిరా నేను” అని చెప్పే డైలాగ్ డెలివరీ, ఎన్టీ రామారావు గారిని గుర్తుచేసిందని బి. గోపాల్ అన్నారు. ఆ పవర్ఫుల్ నటనలో యాంగిల్ షాట్స్, చెప్పే విధానం కొండవీటి సింహం సినిమాలో ఎన్టీఆర్ నటనను తలపించాయని అన్నారు.
బాలకృష్ణ పంచువాలిటీ, వృత్తి పట్ల అంకితభావం అద్భుతమని బి. గోపాల్ తెలిపారు. తనకు 7 గంటలకు షాట్ అని చెప్తే, బాలకృష్ణ 6:55 గంటలకే సెట్కు చేరుకునేవారని, ఎప్పుడూ ఆలస్యం చేసేవారు కాదని చెప్పారు. సెట్లో సిన్సియర్గా పనిచేయకుండా ఆలస్యం చేస్తేనే బాలకృష్ణకు కోపం వస్తుందని, తాము ఎప్పుడూ ఆ అవకాశం ఇవ్వలేదని గోపాల్ స్పష్టం చేశారు. ఈ ఐదు సినిమాల్లో ఏ ఒక్క సందర్భంలోనూ బాలకృష్ణతో తనకు విభేదాలు, కోపం రావడంగానీ జరగలేదని అన్నారు. లారీ డ్రైవర్ సినిమా సమయంలో ఒక సంఘటన జరిగింది. పరుచూరి బ్రదర్స్ రాసిన స్క్రిప్ట్లో కొన్ని మార్పులు జరిగాయి. పరుచూరి గోపాలకృష్ణ ఒక వర్షన్ ఇవ్వగా, వెంకటేశ్వరరావు వచ్చి కొన్ని సీన్లు మార్చారు. ఇవి రష్ చూసిన గోపాలకృష్ణకు నచ్చలేదు. ఒక పవర్ఫుల్ కలెక్టర్ పాత్రను కామెడీగా చిత్రీకరించడం సినిమాకు తప్పు అని ఆయన భావించారు. దీంతో కొన్ని రీషూట్లు చేయాల్సి వచ్చింది. ఈ రీషూట్ల సమయంలో బాలకృష్ణకు సరిగ్గా వివరించలేకపోవడం వల్ల ఆయన కొద్దిరోజులు అలిగారు. అయితే, తర్వాత విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ అర్థం చేసుకున్నారని గోపాల్ గుర్తుచేసుకున్నారు.
బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ విజయవంతమయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు రెండూ ఇండస్ట్రీ రికార్డ్ హిట్లుగా నిలిచాయి. సమరసింహారెడ్డి 105 కేంద్రాల్లో 100 రోజులు, 31 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. నరసింహనాయుడు కూడా అద్భుత విజయం సాధించింది. అయితే, ఈ నాలుగు సూపర్ డూపర్ హిట్ల తర్వాత వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు డిసప్పాయింట్మెంట్ అవడానికి కారణాలపై బి. గోపాల్ విశ్లేషించారు. ఆడియన్స్ సినిమాను నచ్చకపోతే ఫ్లాప్ అవుతుందని, నచ్చితే హిట్ అవుతుందని ఆయన అన్నారు. పల్నాటి బ్రహ్మనాయుడులో అతి కమర్షియల్ అంశాలు, రైలు సీన్, కుర్చీ వచ్చే సీన్లు విమర్శలకు గురయ్యాయని అంగీకరించారు. ముఖ్యంగా రైలు సీన్ పెద్ద తప్పు అని, దానికి చెడ్డపేరు వచ్చిందని, అది తమ తప్పేనని సిన్సియర్గా ఒప్పుకున్నారు. ప్రేక్షకులు నచ్చనివాటిని తిరస్కరిస్తారని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.