
భారతీయ సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె. ఆమె సినీ ప్రస్థానం ఎత్తుపల్లాలు, కష్టనష్టాలను ఎదుర్కొని స్టార్ గా మారిపోయింది. స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సొంతం చేసుకొని రాణించింది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి చిత్రంలో శివగామిగా పవర్ఫుల్ పాత్రకు ప్రాణం పోసి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రమ్యకృష్ణ, కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే విమర్శలను ఎదుర్కొన్నారు. రమ్యకృష్ణ 13 ఏళ్ల వయసులో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. వైజయంతి మహేంద్ర హీరోగా నటించిన వెళ్ళై మనసు ఆమె మొదటి చిత్రం. ఈ సినిమాతో పాటు తెలుగులో భలే మిత్రులు, మదన గోపాలుడు వంటి ఆమె తొలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. వరుసగా చేసిన చిత్రాలు విజయవంతం కాకపోవడంతో, పరిశ్రమలో ఆమెకు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఈ అవమానాలతో ఒకానొక దశలో ఆమె వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ ఓటమి ఆమెను నిరుత్సాహపరచలేదు.
రమ్యకృష్ణలోని నటనా సామర్థ్యాన్ని గుర్తించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఆమె కెరీర్కు ఒక కొత్త మలుపునిచ్చారు. ఐరన్ లెగ్ అనే ముద్ర ఉన్న నటిని ఎంపిక చేయడం అప్పట్లో చాలా ధైర్యంతో కూడుకున్న నిర్ణయం. మోహన్బాబు హీరోగా తెరకెక్కిన అల్లుడు గారు చిత్రంలో రమ్యకృష్ణను ఎంపిక చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి, రమ్యకృష్ణ కెరీర్ను విజయపథంలోకి నడిపించింది. ఆ తర్వాత రాజశేఖర్తో కలిసి నటించిన అల్లరి ప్రియుడు చిత్రం కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఈ రెండు విజయాలతో ఆమె ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్గా మారారు. రమ్యకృష్ణ తన సినీ ప్రస్థానంలో అనేక ఐకానిక్ పాత్రలకు ప్రాణం పోశారు. రజనీకాంత్ సరసన నటించిన పడయ్యప్ప (తెలుగులో నరసింహ) చిత్రంలో నీలాంబరి పాత్ర ఆమె కెరీర్లోని మైలురాళ్లలో ఒకటి. ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేయడానికి చాలామంది నటీమణులు భయపడ్డారు. కానీ రమ్యకృష్ణ ఈ పాత్రలో ఒదిగిపోయి, తన అద్భుతమైన నటనతో రజనీకాంత్కు ధీటుగా నిలిచారు. అమ్మోరు చిత్రంలో దైవిక పాత్రలో నటించి, నిజమైన దేవతగా పూజలు అందుకున్నారు. ఈ పాత్ర ఆమె నటనా జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది.
బాహుబలిలో శివగామి పాత్రతో ఆమె అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఒక తల్లిగా, పాలకురాలిగా, శక్తివంతమైన నాయకురాలిగా ఆమె శివగామి పాత్రకు జీవం పోశారు. అన్నమయ్య చిత్రంలోనూ ఆమె తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. నాగార్జున సరసన చంద్రలేఖలో వీల్చైర్లో ఉండి స్ట్రగుల్ అయ్యే పాత్రను, కంటే కూతుర్నే కను చిత్రంలో పవర్ఫుల్ పాత్రకు నంది అవార్డు పొందారు. వ్యక్తిగత జీవితానికి వస్తే, రమ్యకృష్ణ అసలు పేరు రమ్య. ఆమె తండ్రి పేరు కృష్ణన్ కావడంతో రమ్యకృష్ణన్ గా ప్రసిద్ధి చెందారు. చిన్నతనం నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు. ఎంజీఆర్, జయలలిత వంటి వారికి రాజకీయ సలహాదారు అయిన చో రామస్వామి, రమ్యకృష్ణకు చిన్నతనం నుంచే మార్గనిర్దేశం చేశారు. రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో రమ్యకృష్ణ బిజీగా ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి