
ప్రఖ్యాత డ్యాన్స్ షో ఢీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆయన అభిమానులు, డ్యాన్స్ రంగానికి చెందినవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ప్రకారం, పండు మాస్టర్ తన బృందంతో కలిసి తగరపువలసలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రయాణం మధ్యలో టీమ్లోని ఒక సభ్యుడు అస్వస్థతకు గురికావడంతో డ్రైవర్ రోడ్డుపక్కన కారును ఆపాడు. ఆ సమయంలో పండు మాస్టర్ కారులో నుంచి దిగి రోడ్డుపై నిలబడి ఉన్నారు. ఇదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కోళ్ల వ్యాన్ నియంత్రణ కోల్పోయి నిలిచి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ప్రభావంతో కారు తీవ్రంగా దెబ్బతినగా, కారు పక్కనే ఉన్న పండు మాస్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహచరులు స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కోళ్ల వ్యాన్ అతివేగమే ప్రమాదానికి కారణమా? లేక డ్రైవర్ నిర్లక్ష్యమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేక డ్యాన్స్ స్టైల్తో, కామెడీతో గుర్తింపు పొందిన పండు మాస్టర్కు ప్రమాదం జరగడం అభిమానులను కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు.
Accident