బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీతో పాటు దక్షిణాదిలోనూ పలువురు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేశారాయన. తన ప్రతిభకు గుర్తింపుగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. అలాంటి గణేష్ ఆచార్య ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు. ఆయన నృత్య రీతుల సమకూర్చిన సూసేకీ, కిస్సిక్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులోని స్టెప్పులకు కూడా మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన గణేష్ ఆచార్య, అల్లు అర్జున్, బాలీవుడ్ నటుల మధ్య ఉన్న తేడాను బయటపెట్టారు. ‘పుష్ప’ సినిమాకు నేను కొరియోగ్రఫీ చేసినప్పుడు, నేను కంపోజ్ చేసిన స్టెప్పులు అల్లు అర్జున్కి బాగా నచ్చాయి. అవి అతనికి ఎంత బాగా నచ్చాయంటే, నన్ను అభినందించడానికి స్వయంగా నాకు ఫోన్ చేశాడు. నాపై ప్రశంసలు కురిపించారు. అప్పుడు డ్యాన్స్ గురించి మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం. నేను చాలా బాలీవుడ్ సినిమాల్లో నటించాను, స్టార్ హీరోలతో కలిసి పనిచేశాను. కానీ ఒక్క నటుడు కూడా నాకు ఫోన్ చేసి ఇలా చేయలేదు’ అని గణేశ్ ఆచార్య చెప్పుకొచ్చారు.
‘పుష్ప 2’ సినిమాలో పనిచేయడానికి నేను చాలా భయపడ్డాను. అంతకు ముందు ‘పుష్ప 1’ సినిమాలోని స్టెప్పులకు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. దీంతో నేను ఆ స్థాయిలో చేయలేనేమో అని భయపడ్డాను. కానీ అల్లు అర్జున్ స్వయంగా నాకు ధైర్యం చెప్పాడు. బన్నీ భరోసాతోనే నేను ‘పుష్ప 2′ సినిమాకు కూడా మంచిగా కొరియోగ్రఫీ చేయగలిగాం’ అని గణేష్ ఆచార్య తెలిపారు.
గణేష్ ఆచార్య ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు కూడా పనిచేస్తున్నారు. కన్నడలో యష్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి ఆయన మాస్టర్ గా పనిచేస్తున్నారు. కేవలం కొరియోగ్రాఫర్గా మాత్రమే కాకుండా నటుడిగా, చిత్ర దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు గణేష్ ఆచార్య. మరోవైపు పుష్ప2 సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..