
బిగ్ బాస్ తెలుగు ఫేమ్ శేఖర్ బాషా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో ఆర్జేగా, ఆ తర్వాత యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ బాష. ఇక గతేడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేశాడు. హౌస్ లో రెండు వారాలు ఉండి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన శేఖర్ బాషా ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. తనకు సంబంధం లేని విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ కారణంగానే ఆ మధ్యన హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో, అలాగే జానీ మాస్టర్ వర్సెస్ శ్రేష్టి వర్మ కేసులో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు శేఖర్ బాషానే పోలీసులను ఆశ్రయించాడు. ఓ టాలీవుడ్ హీరో భార్య తనను వేధిస్తుంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన శేఖర్ బాషా టాలీవుడ్ హీరో ధర్మ మహేష్- గౌతమిల వివాదంపై మాట్లాడాడు. హీరో ధర్మ మహేష్కి సపోర్ట్ గా మాట్లాడాడు. ఇప్పుడిదే వివాదానికి కారణమైంది. ధర్మ మహేష్ కు మద్దతుగా మాట్లాడినందుకు గౌతమి చౌదరి తనను టార్గెట్ చేసిందని శేఖర్ బాషా పోలీసులను ఆశ్రయించాడు.
సోమవారం (డిసెంబర్ 01) పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లిన శేఖర్ బాషా గౌతమీ చౌదరిపై ఫిర్యాదు చేశాడు. ‘హీరో ధర్మ మహేష్కి సపోర్ట్ గా మాట్లాడిన కారణంగా గౌతమి నన్ను టార్గెట్ చేస్తోంది. బీహార్ రౌడీలను పంపించి నన్ను చంపిస్తానని బెదిరిస్తుంది. నా తల్లి, కూతురుపై కూడా గౌతమి అభ్యంతకర వ్యాఖ్యలు చేసింది. అందుకే ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శేఖర్ బాషా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పంజా గుట్ట పోలీసులు గౌతమీ చౌదరిపై కేసు నమోదు చేశారు. BNS 351(3) 352 , 67 IT Act సెక్షన్ల కింద గౌతమిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ మధ్యన ధర్మ మహేష్- గౌతమీల వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిద్దు పరస్పరం ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడిదే వ్యవహారంలో తల దూర్చి మళ్లీ వార్తల్లో నిలిచాడు శేఖర్ బాషా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.