
సీనియర్ హీరోయిన్ రోజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత అనుభవాలపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఆమె కమల్ హాసన్తో కలిసి నటించకపోవడానికి గల కారణాన్ని, రజినీకాంత్, ఇతర దిగ్గజాలతో తన ప్రయాణాన్ని వివరించారు. తన సినీ కెరీర్లో ఎంతో మంది అగ్ర తారలతో కలిసి నటించిన రోజా, కమల్ హాసన్తో ఎందుకు నటించలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, అది తన వ్యక్తిగత నిర్ణయమని, ఆయనతో నటించడం తనకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం తనదేనని, ఈ విషయంలో తనకు ఎలాంటి బలవంతం లేదని ఆమె వివరించారు. రజినీకాంత్తో కలిసి తాను రెండు చిత్రాల్లో నటించానని, ఆయన సెట్లో చాలా సరదాగా, ఆటపట్టించే స్వభావంతో ఉండేవారని రోజా గుర్తు చేసుకున్నారు.
ఒకసారి లంచ్ బ్రేక్ తర్వాత తాను ఈజీ చైర్లో నిద్రపోతున్నప్పుడు, రజినీకాంత్ స్వయంగా తనపై గొడుగు పట్టుకుని, నిద్రిస్తున్న తన ఫోటోలు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారని, ఆ సంఘటన తనకు ఇప్పటికీ గుర్తోని ఉందని నవ్వుతూ చెప్పారు రోజా. సహనటి మీనాతో కూడా అలాంటి సరదా సంఘటనలు ఉన్నాయని ఆమె తెలిపారు. శివాజీ గణేషన్ వంటి గొప్ప నటులు కూడా లంచ్ బ్రేక్ వరకు సెట్లోనే ఉండేవారని, ఆ వాతావరణం ఇప్పుడు కరువైందని రోజా అన్నారు. అలాగే తను సెల్వా మణిని ప్రేమించినప్పుడు చిరంజీవి గారు సరదాగా “నీకు తెలుగువాళ్లు దొరకలేదా, అరవోడిని ప్రేమించావా” అని ఆటపట్టించేవారని రోజా గుర్తు చేసుకున్నారు.
సెల్వా మణి డీసెంట్ వ్యక్తి అని, ఆయనకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదని, మహిళలకు సమాన ప్రాధాన్యం ఇస్తారని, వారి ఎదుగుదలకు ఎప్పుడూ మద్దతుగా ఉంటారని ప్రశంసించారు. తన కూతురికి కూడా ఇదే ప్లస్ అని, సెల్వా మణి పుస్తకాలు ఎక్కువగా చదువుతారని, మహిళా సాధికారతకు ఆయన ఎంతగానో మద్దతు ఇస్తారని రోజా వివరించారు. ఆయన తండ్రి టీచర్ అయినా, సెల్వా మణి సినిమా పిచ్చితో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి దర్శకుడు అయ్యారని రోజా పేర్కొన్నారు. అలాగే ఇండస్ట్రీలోకి రాకముందు తనకు ఎయిర్ హోస్టెస్ కావాలని కోరిక ఉండేదని, అయితే ఆ వృత్తిలోని సవాళ్లను తెలుసుకొని ఆ ఆలోచనను విరమించుకున్నానని రోజా తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాకే తన గళం బలంగా వినిపించగలుగుతున్నానని ఆమె పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.