
ప్రముఖ మలయాళ నటి అరుంధతి నాయర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నటి అరుంధతి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను కేరళలోని తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తిరిగి తన సోదరుడితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్ధిక సాయం చేయాలంటూ సీరియల్ నటి గోపిక అనిల్ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధిస్తున్నారు.
‘నా స్నేహితురాలు అరుంధతికి నిన్న ప్రమాదానికి గురైంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతోంది. రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత ఆమె కుటుంబానికి లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోదు. ఆమె కుటుంబానికి ఎంతో సహాయకారిగా ఉండేందుకు మీరూ కూడా సహాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది’ అంటూ బ్యాంకు, ఫోన్ నంబర్ వివరాలను ఇన్స్టా పోస్టులో పొందుపరిచింది.
కాగా నటి అరుంధతీ నాయర్ తమిళ మువీ ‘పొంగి ఎలు మనోహర (2014)’తో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత విరుమాండికుమ్ శివానందికమ్, సైతాన్, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. 2018 మలయాళంలో విడుదలైన ‘ఒట్టకోరు కముకన్’తో మలయాళంలో హీరోయిన్గా అరంగెట్రం చేసింది. అయితే విజయ్ ఆంటోని సరసన నటించిన సైతాన్ మువీతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె చివరిగా గత ఏడాది విడుదలైన ఆయిరం పోర్కాసుకల్ అనే మువీలో నటించింది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.