AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sakshi Rangarao: 450పైగా సినిమాలు.. చివరి క్షణం వరకు నటన.. ఆ కారణం వల్లే మరణం.. సాక్షి రంగరావు కొడుకు కామెంట్స్..

నటుడు సాక్షి రంగారావు కుమారుడు శివ, తన తండ్రి చివరి రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలను, ఆరోగ్య సమస్యలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సిగరెట్ వ్యసనం మానేసిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించిందని, ఆర్థిక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. కన్యాశుల్కం నాటక రిహార్సల్స్ సమయంలో జరిగిన సంఘటనలు, విజయ్ ఆసుపత్రిలో 50 రోజుల పోరాటం, అలాగే పూర్వీకుల స్వగ్రామం గురించి శివ వివరించారు.

Sakshi Rangarao: 450పైగా సినిమాలు.. చివరి క్షణం వరకు నటన.. ఆ కారణం వల్లే మరణం.. సాక్షి రంగరావు కొడుకు కామెంట్స్..
Sakshi Ranga Rao
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2026 | 9:03 AM

Share

ప్రఖ్యాత నటుడు సాక్షి రంగారావు తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు 450కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. విలక్షణమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలుగెలుచుకున్నారు. సాక్షి రంగారావు జీవితంలోని చివరి ఘట్టాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత విశేషాలను ఆయన కుమారుడు శివఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. రంగారావు గారు 63 ఏళ్ల వయసులో మరణించారని, అయితే కన్యాశుల్కం నాటక రిహార్సల్స్ జరుగుతుండగా లేదా షూటింగ్‌లో గుండెపోటుతో పడిపోయారనే వార్తలు కేవలం అవాస్తవాలని శివ అన్నారు. నిజానికి, ఒక ప్రెస్ మీట్ నుండి తిరిగి వస్తున్నప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఆయన అస్వస్థతకు గురై కిందపడిపోయారని తెలిపారు. ఆయన గుండెపోటుకు గురైన తర్వాత 50 రోజుల పాటు విజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందారని, అప్పట్లో అనుభవించిన బాధ వర్ణనాతీతమని శివ గుర్తు చేసుకున్నారు. చివరికి, చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆయన అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోయాయని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. రంగారావు గారి అనారోగ్యానికి ప్రధాన కారణం ఆయన అలవాటు చేసుకున్న సిగరెట్‌ను పూర్తిగా మానేయడమేనని శివ అన్నారు. ఏడవ తరగతి నుంచే సిగరెట్ అలవాటున్న రంగారావు గారు, 60వ షష్టిపూర్తి తర్వాత ఒక సంఘటనతో సిగరెట్ పూర్తిగా మానేశారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

రామకృష్ణ మఠంలో ఒక భక్తురాలు ఆయనను సిగరెట్ కాల్చడం చూసి మందలించడంతో, ఆ క్షణమే దాన్ని విసిరి పారేసి, అప్పటి నుండి మళ్లీ ఎప్పుడూ ముట్టుకోలేదని శివ వివరించారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలలోనే ఆయన అన్ని అవయవాలు దెబ్బతిన్నాయని శివ పేర్కొన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సిగరెట్ ఒక మార్గంగా ఉండగా, దాన్ని మానేయడంతో లోపల ఒత్తిడి పెరిగి అనారోగ్యానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. శివ తల్లి ఇప్పటికీ తమను సిగరెట్లు పూర్తిగా మానకుండా, తగ్గించుకోవాలని సూచిస్తారని చెప్పారు. ఆయనకు నాన్-వెజ్, మద్యం వంటి అలవాట్లు లేవని, కేకులు, బిస్కెట్లు కూడా గుడ్డు ఉంటుందనే ఉద్దేశంతో తినేవారు కాదని శివ స్పష్టం చేశారు. అయితే చిన్నప్పుడు తన తండ్రి రాజ్ బాబు, ఆంధ్ర దిలీప్, తెలంగాణ వంటి స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు బీర్ తాగేవారని గుర్తు చేసుకున్నారు. కే. విశ్వనాథ్, చలం, పద్మాలయ వంటి ప్రముఖులు తన తండ్రిని ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

ఆర్థికంగా రంగారావు గారికి ఇబ్బందులు ఎదురయ్యాయని శివ వెల్లడించారు. సినిమా అవకాశాలు తగ్గినప్పుడు కుటుంబ పోషణ కష్టమయ్యేదని, అప్పట్లో చంద్రమోహన్ గారి నుండి అప్పులు తీసుకునేవారని చెప్పారు. స్థలాలపై పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఆయనకు ఉండేది కాదని, శోభన్ బాబు గారు ఎంత చెప్పినా వినలేదని తెలిపారు. తమ ఇంటి పక్కనే పెద్ద స్థలం వచ్చినా డబ్బులున్నా కొనుగోలు చేయలేదని, హైదరాబాద్‌లో కూడా పరిశ్రమ మారినప్పుడు దక్కిన అవకాశాలను నిర్లక్ష్యం చేశారని శివ చెప్పారు. వారసత్వ సంపద విషయానికి వస్తే, రంగారావు గారి మామగారి ఊరైన కొండిపూరు, పామర్రులో తమకు రెండు ఎకరాల ఆస్తి ఉండేదని, అది ఒకరు మోసపూరితంగా కాజేశారని శివ ఆవేదన వ్యక్తం చేశారు. చలపతి రావు గారు ఎంతగా సూచించినా, తన తండ్రి దాన్ని తన పేరు మీద రాయించుకోవడానికి ఆసక్తి చూపలేదని, ఆయన మరణించిన తర్వాత అది మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. తమ తాతల ఊరు అద్దంకి దగ్గర కలవకూరు అని, అక్కడ మహాలక్ష్మి అమ్మవారి గుడిని తమ పూర్వీకులు నిర్మించారని, ఆ గుడిని శివ ఇప్పుడు సందర్శిస్తున్నారని తెలిపారు. తన తండ్రికి తోబుట్టువులు లేరని, తన పెదనాన్న రంగవజ్జుల ఆదిశేషయ్య నాటక రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారని, ఎస్బీఐ విజయవాడలో పనిచేసేవారని శివ తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us